Mumbai High Court: ఆ 12 మంది నిర్దోషులే… ముంబై పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ముంబై పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందారని వ్యాఖ్యానించింది. 2006 జులై 11న ముంబై సబర్బన్ రైళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో...

ముంబై పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందారని వ్యాఖ్యానించింది. 2006 జులై 11న ముంబై సబర్బన్ రైళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో189మంది మృతి చెందగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. 2015 అక్టోబరులో 12 మంది నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు.. ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పునిచ్చింది. ప్రస్తుతం నిర్దోషులుగా విడుదలవుతున్న వారిలో మరణశిక్షపడ్డ దోషులు కూడా ఉన్నారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ముంబయి రైలు పేలుళ్ల ఘటన నాడు దేశంలో సంచలనం రేపాయి. 2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వేలైన్లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబులు పేలాయి. ఆ మారణ హోమం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు.. 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కొవిడ్ కారణంగా నాగ్పుర్ జైల్లో చనిపోయాడు.
ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టు గడప తొక్కారు. వాటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ అంశం ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. దీనిపై అనేక అభ్యర్థనల తర్వాత 2024 జులైలో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్ను హైకోర్టు ఏర్పాటుచేసింది. అప్పటినుంచి విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పును వెల్లడించింది.
నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని, నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఉన్నత న్యాయ స్థానం అభిప్రాయపడింది.




