AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు.. ఇద్దరు విద్యార్థులు మృతి.. మరో ఐదుగురు..

ఉత్తరప్రదేశ్‌ లోని ఫరుఖాబాద్‌లో భారీ పేలుడు జరిగింది. సన్‌ కోచింగ్‌ సెంటర్‌ భవనంలో అనుమానాస్పద పేలుడులో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు విద్యార్ధులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు.. ఇద్దరు విద్యార్థులు మృతి.. మరో ఐదుగురు..
Blast At Coaching Centre
Shaik Madar Saheb
|

Updated on: Oct 04, 2025 | 8:36 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్ లో శనివారం భారీ పేలుడు సంభవించింది. సన్‌ కోచింగ్‌ సెంటర్‌ భవనంలో జరిగిన అనుమానాస్పద పేలుడులో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు విద్యార్ధులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్డులోని సన్ కోచింగ్ సెంటర్‌లో పేలుడు ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని.. పోలీసులు తెలిపారు. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ (DM), పోలీసు సూపరింటెండెంట్ (SP) సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి పోలీసుల నుంచి వివరాలు సేకరించారు.

గాయపడిన విద్యార్థులను సైఫాయి మెడికల్ కాలేజీకి తరలింపు..

సమాచారం అందుకున్న వెంటనే, ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన ఏడుగురు విద్యార్థులను చికిత్స కోసం పోలీసులు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఈ విద్యార్థులలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ విద్యార్థులలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. భవనం భాగాలు 20 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వినిపించింది.

సెప్టిక్ ట్యాంక్‌లో పేలుడు..

సెప్టిక్ ట్యాంక్‌లో గ్యాస్ పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక పోలీసు దర్యాప్తులో తేలింది. మీథేన్ వాయువు వల్ల పేలుడు సంభవించిందని సంఘటనా స్థలంలో ఉన్న ఫోరెన్సిక్ బృందం తేల్చింది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని లోపలి నుండి అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్ దూబే, పోలీసు సూపరింటెండెంట్ ఆర్తి సింగ్ వివరాలను సేకరించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రమాదం గురించి ఎస్పీ ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. “మధ్యాహ్నం 3:19 గంటలకు సమాచారం అందింది. ఇది బేస్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ ఉన్న కోచింగ్ సెంటర్. ట్యాంక్‌లో అధిక సాంద్రత కలిగిన మీథేన్ పేలుడుకు కారణమైంది. అక్కడ ఒక స్విచ్‌బోర్డ్ కూడా కనుగొనబడింది. దీని వల్లే పేలుడు జరిగి ఉండవచ్చు. ఈ సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు.”.. అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..