Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..
పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధికారుల అలసత్వం నిండు ప్రాణాన్ని బలిగొంది. అధికారులు ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థి మరణించాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంలో మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. స్కూల్ సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. వసతి గృహాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే విద్యార్థుల మరణాలకు కారణమని గిరిజన సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యంతో విద్యార్థుల వరుస మరణాలు హృదయవిదారకంగా మారుతున్నాయి. గత నాలుగు రోజుల క్రితం కురుపాం మండలం మర్రిమానుగూడ గ్రామానికి చెందిన నాలుగవ తరగతి విద్యార్థి బిడ్డిక రాహుల్ (9) అనారోగ్యంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న రాహుల్.. గత కొద్దిరోజులుగా హాస్టల్లో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పచ్చకామెర్లు (జాండిస్) లక్షణాలతో సుమారు వారం రోజుల పాటు రాహుల్ హాస్టల్ లోనే బాధపడుతూ గడిపాడు. కేవలం పారాశెట్మాల్ టాబ్లెట్ ఇచ్చి హాస్టల్ లోనే ఉంచారు. అలా హాస్టల్ లోనే పచ్చకామెర్లు ముదిరి ఆరోగ్యం క్షీణించింది.
పరిస్థితి గమనించిన అదే హాస్టల్ లో ఉన్న రాహుల్ సోదరుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ కు వచ్చి రాహుల్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటడంతో చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందాడు. సిబ్బంది సరైన సమయంలో స్పందించక పోవడం వల్లే రాహుల్ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాలుడి ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ.. తగిన వైద్యసహాయం అందించకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యం లేదా ఇతర కారణాలతో గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత ఆరు నెలల్లో ఇలాంటి మరణాలు తరుచూ జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై గ్రామస్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడంపై మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో రాహుల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారి మృతి గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
