Ayodhya: అయోధ్య టెంపుల్లో ఉద్యోగం.. ఒక్కటే పోస్ట్.. 5వేలకు పైగా అప్లికేషన్స్.. వీళ్లు మాత్రమే అర్హులు!
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య రామాలయం గురించి అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆలయం నుంచి ఓ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఒక్క పోస్టుకే.. కానీ వచ్చిన దరఖాస్తులు మాత్రం 5 వేలకు పైగా. ఇంతకూ ఆ పోస్ట్ ఏంటి.. ఆ పోస్ట్కు ఎందుకు అంత డిమాండ్ ఉంది. ఆ పోస్ట్కు అర్హతలు ఏంటి.. అర్హులు ఎవరనేది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అయోధ్య రామాలయంలో ఉద్యోగం.. ఉన్నది ఒక్క పోస్టు.. కానీ దరఖాస్తులు మాత్రం 5 వేలకు పైగా వచ్చాయి.. అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ CEO గా పనిచేసేందుకు భారీ సంఖ్యలో అభ్యర్థులు ముందుకు వచ్చారు. ఇందులో రిటైర్డ్ IAS, IPS, IRS అధికారులతో పాటు భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. రేసులో పరిపాలన, మేనేజ్మెంట్, ప్రజాసేవ రంగాల్లో విశేష అనుభవం ఉన్న పలువురు నిపుణులు కూడా ఉన్నారు. ట్రస్ట్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే తుది ఎంపిక ఉండనుంది. జూలై 6న జరిగిన ట్రస్ట్ సమావేశంలో CEO ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. సెర్చ్ కమిటీలో రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) విష్ణుకాంత్ చతుర్వేది, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, మాజీ చైర్మన్ సురేష్ హవారే ఉన్నారు. వీరు దరఖాస్తుల పరిశీలన అనంతరం స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా సీఈఓ నియామకం చేపట్టనున్నారు. జులై 22 న సీఈఓ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది
సీఈఓ ఎందుకంటే ?
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఘటన తరువాత ఆలయ నిర్వహణ మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ రామ మందిరానికి ట్రస్టు సీఈఓను నియమిస్తుంది. ప్రస్తుతం అయోధ్య రామాలయం నిర్మాణ దశ నుంచి నిర్వహణ దశకు మారుతున్నందున, ఇటీవలి విరాళాల దుర్వినియోగ ఆరోపణలు, పారదర్శకత కోసం ఈ సీఈఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు పాలసీలపై దృష్టి సారించేలా చేయడానికి ట్రస్టీలు ఆపరేషనల్ విషయాల్లో నేరుగా జోక్యం చేసుకోకుండా ఉండేలా ఈ సీఈఓ వ్యవస్థ పనిచేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆలయాల్లో ముఖ్యంగా వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఆలయాల్లో తిరుపతి, షిర్డి, వైష్ణోదేవి, గోల్డెన్ టెంపుల్,సోమనాథ్ వంటి ఇతర ఆలయాల్లో ఇప్పటికే ఇలాంటి వృత్తిపరమైన నిర్వహణ వ్యవస్థ(EO ,CEO) ఉంది.
అయోధ్య రామమందిర సీఈవో అర్హతలు
అయోధ్య రామాలయ సీఈఓ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయసు 50-70 ఏళ్ల మధ్య ఉండాలి.. హిందీ , ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ లేదా ఆర్థిక విభాగాల్లో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. గతంలో ఆలయాల నిర్వహణలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థి తప్పనిసరిగా హిందూ మతాన్ని అనుసరించేవారై ఉండాలి. వచ్చిన దరఖాస్తుల నుంచి షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులతో కమిటీ ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించి కమిటీ అర్హులైన వారిని సీఈఓ గా నియమిస్తుంది. ఎంపికైన వ్యక్తి సీఈఓగా మూడేళ్ల పాటు బాధ్యతల్లో ఉంటారు. సీఈఓ గా ఉండే వ్యక్తి అయోధ్యలోనే నివసించాల్సి ఉంటుంది
రామ్ మందిర్ ట్రస్ట్ CEO పని ఏమిటంటే ?
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో CEO పదవి ఇప్పటివరకు లేని కొత్త బాధ్యత. ఇది ట్రస్ట్ పరిపాలనను వృత్తిపరంగా, పారదర్శకంగా మార్చడానికి ఏర్పాటు చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు పాలసీలు, ప్రధాన నిర్ణయాలు తీసుకుంటే CEO రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తారు. CEO ప్రతి రోజు తన పని ప్రారంభం రామ్ లల్లా దర్శనంతో పని చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగం కాదు.. రామభక్తితో కూడిన సేవా భావనకి నిదర్శనంగా ఈ రూల్ పెట్టారు. ఆలయం యొక్క రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, సిబ్బంది నిర్వహణ, షిఫ్టులు, ఉద్యోగుల డిప్లాయ్మెంట్,ఆర్థిక నిర్వహణ, విరాళాలు, ఆదాయాలు, ఖర్చులు, ఆడిట్, ఆర్థిక పారదర్శకతను నిర్ధారించడం వంటివి కీలక బాధ్యతలుగా ఉంటాయి.
అలాగే ప్రతిరోజూ వేలాది మంది భక్తుల క్రౌడ్ మేనేజ్మెంట్, భద్రత, డిజాస్టర్ మేనేజ్మెంట్ బాధ్యత కూడా సీఈఓ పై ఉంటుంది. ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, వివిధ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం, ఆలయం సంబంధిత మిగిలిన నిర్మాణ కార్యకలాపాలు, మెయింటెనెన్స్ పర్యవేక్షణ, ముఖ్యమైన అంశాలపై మీడియాకు సమాచారం అందించడం, భక్తుల ఫీడ్బ్యాక్ సమీక్ష, సిబ్బంది శిక్షణ, టెక్నాలజీ ఉపయోగం, మెటీరియల్ మేనేజ్మెంట్ వంటి వాటిని సిబ్బంది ,ఉద్యోగుల సహకారంతో సీఈఓ పరివేక్షించాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
