పాకిస్థాన్ జెండాలు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్కు కేంద్ర ప్రభుత్వ నోటీసులు!
కేంద్ర వినియోగదారుల సంరక్షణ అధికార సంస్థ (CCPA) అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఉబుయ్ వంటి ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలను వెంటనే నిషేధించాలని ఆదేశించింది. పాకిస్తాన్తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. జాతీయ భావాలకు విరుద్ధంగా ఉన్న వస్తువులను తొలగించాలని CCPA ప్లాట్ఫామ్లను కోరింది.

పాకిస్తానీ జెండాలు, పాక్ సంబంధిత వస్తువుల అమ్మకాలపై అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, ఉబుయ్ ఇండియా, ఎట్సీ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) బుధవారం నోటీసులు జారీ చేసింది. అటువంటి వస్తువులు ఉంటే వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించి, జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్లాట్ఫామ్లను ఆదేశించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీనికి సంబంధించిన ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలీ జాతీయుడు సహా 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తరువాత పాకిస్తాన్తో ఉద్రిక్తతల పెరిగిన విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
అంతకుముందు భారతదేశంలో పనిచేస్తున్న ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పాకిస్తాన్ జెండాలు, ఇతర వస్తువుల అమ్మకాలను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషిలను కోరింది. భారతదేశం ప్రత్యర్థిపై ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించినప్పటికీ, పాకిస్తాన్ జెండాలు, వస్తువులను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో జాబితా చేయవచ్చని పరిశ్రమ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో రాసింది. మన జాతీయ భావాలు, సార్వభౌమాధికారం మూలాన్ని తాకే విషయంపై నా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పాకిస్తాన్ జెండాలు, లోగో ఉన్న మగ్గులు, టీ-షర్టులు బహిరంగంగా అమ్ముడవుతున్నాయని వెలుగులోకి వచ్చింది అని CAIT జాతీయ అధ్యక్షుడు BC భారతీయ మంత్రి గోయల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మన సాహసోపేతమైన సాయుధ దళాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆపరేషన్ సిందూర్లో చురుకుగా నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ ఆందోళనకరమైన పరిస్థితి బయటపడుతుంది అని ఆయన అన్నారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి మన సైనికులు అసమానమైన ధైర్యం, త్యాగాలను ప్రదర్శిస్తున్న సమయంలో శత్రు దేశాన్ని సూచించే వస్తువులను అమ్మడం అసహ్యకరమైనది మాత్రమే కాదు, పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఆ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పాకిస్తానీ జెండాలు, లోగోలు, ఇతర సంబంధిత వస్తువుల అమ్మకాలను వెంటనే నిషేధించాలని ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని CAIT, భారత ప్రభుత్వాన్ని కోరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




