
అమర్నాథ్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రలో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 10 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ ప్రాంతంలోని టాచ్లూ క్రాసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని ప్రాథమిక చికిత్స అందించి అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. యాత్రికులు స్వల్పంగా గాయపడ్డారని, అంతా క్షేమంగా ఉన్నారని వైద్య అధికారులు తెలిపారు. కుల్గాం ప్రమాదంతో తాత్కాలికంగా అంతరాయం కలిగినప్పటికీ తిరిగి యాత్రా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు వాహనాల మధ్య తగినంత దూరం పాటించి కాన్వాయ్ ప్రోటాకాల్ను పాటించాలని అధికారులు సూచించారు.
ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాహనాలు ఢీకొనడానికి కారణాలపై విచారణ చేపట్టారు. అమర్నాథ్ యాత్ర కోసం భాగవత్ నగర్ క్యాంపు నుంచి 7వేల 48 మంది యాత్రికులతో కూడిన కొత్త బ్యాచ్ ఆదివారం జర్నీ ప్రారంభించింది. వీరిలో వెయ్యి 423 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 136 మంది సాధువులు, సాధ్వీలు ఉన్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కాన్వాయ్లో యాత్రికులు ఉదయమే బయలుదేరారు.
4వేల 158 యాత్రికులు పహల్గాం మార్గాన్ని ఎంచుకోవడంతో 148 వాహనాల కాన్వాయ్లతో బయలుదేరారు. 2వేల 891 మంది యాత్రికులు బాట్లా మార్గం గుండా 138 వాహనాల్లో బయలుదేరారు. 33 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటివరకూ అమర్నాథ్ గుహల్లోని మంచు శివలింగాన్ని లక్షా 83వేల మంది యాత్రికులు దర్శించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .