Vande Bharat: మంత్రి గారి డిమాండ్ నెరవేరితే.. అక్కడి నుంచి హైదరాబాద్కు వందే భారత్ రైలు..
భారత రైల్వే వందేభారత్ రైళ్లను పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే విజయవంతంగా నడుపుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది.
Vande Bharat Train: భారత రైల్వే వందేభారత్ రైళ్లను పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే విజయవంతంగా నడుపుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి తమ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వందే భారత్ రైలు ప్రారంభించాలంటూ డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సుధీర్ ముంగంటివార్.. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు వందే భారత్ రైలు కావాలంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతానికి, తెలంగాణ రాజధాని హైదరాబాద్కు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని.. చాలామంది ఈ ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తుంటారని వివరించారు. నాగ్పూర్, హైదరాబాద్ రూట్లో వందేభారత్ రైలును ప్రారంభించడం వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని సుధీర్ ముంగంటివార్ పేర్కొన్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు రాసిన లేఖలో.. మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ పలు విషయాలను ప్రస్తావించారు. తెలంగాణలోని హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్పూర్, గోండియా, భండారా, చంద్రపు నాలుగు జిల్లాలకు మంచి వాణిజ్య సంబంధాలున్నాయని తెలిపారు. కావున ఈ రూట్లో వందే భారత్ రైలు నడిపితే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం నాగ్పూర్ హైదరాబాద్ మార్గంలో 22 రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో వందే భారత్ రైలును చేర్చడం వలన తక్కువ సమయంలో 575 కి.మీ దూరాన్ని చేరుకోవచ్చు. వందే భారత్ రైలు వల్ల పర్యాటకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తక్కువ సమయంలో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుందని సుధీర్ ముంగంటివార్ లేఖలో పేర్కొన్నారు. విదర్భలోని నాలుగు జిల్లాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం వల్ల రాష్ట్రంలోని అధిక జనాభాకు ప్రయోజనం చేకూరుస్తుంది.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (డిసెంబర్ 11న) ఛత్తీస్గఢ్లో ఆరవ వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు . ఈ రైలు నాగ్పూర్, బిలాస్పూర్ మార్గంలో నడుస్తుంది. బిలాస్పూర్-నాగ్పూర్ మార్గంలో ప్రయాణించే ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ వారంలో ఆరు రోజులు చొప్పున.. ఐదున్నర గంటల్లో గమ్యానికి చేరుకోనుంది. ఈ రైలు రాయ్పూర్, దుర్గ్, గోండియాలో ఆగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..