
వేసవిలో చాలా మంది సాధారణ నీటి కంటే ఫ్రిజ్లోని చల్లటి నీటిని తాగడానికే ఇష్టపడతారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు తెలుసా? నిరంతరం ఫ్రిజ్ లోని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ నీళ్లు ఎందుకు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
రీరం సరిగ్గా పనిచేయడానికి నిర్దిష్ట అంతర్గత ఉష్ణోగ్రత అవసరం. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే మనం చల్లటి నీరు తాగిన వెంటనే ఆ చల్లదనం జీర్ణరసాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి, జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణంకాక, కడుపులో గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.
మనం తినే ఆహారంలోని నూనెలు, కొవ్వులు చల్లటి నీటితో కలిసినప్పుడు గడ్డకడతాయి. దీనివల్ల పేగుల లోపలి గోడలు గట్టిపడి, మలవిసర్జన కష్టమవుతుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాకుండా చల్లటి నీళ్లు శరీరం కొవ్వును కరిగించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి.
వేగస్ నాడి అనేది మన మెదడును, జీర్ణాశయాన్ని అనుసంధానించే ఒక ముఖ్యమైన నాడి. అధికంగా చల్లటి నీళ్లు తాగినప్పుడు, ఈ నాడి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా తగ్గడానికి దారితీస్తుందని తాజా పరిశోధనలో తేలింది. దీనితో పాటు గొంతు నొప్పి, టాన్సిల్స్, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి.
రిఫ్రిజిరేటర్లోని నీటిని నేరుగా తాగడం వల్ల గొంతులోని కఫం గట్టిపడుతుంది. దీనివల్ల శ్వాస మార్గాలు మూసుకుపోయి గొంతు నొప్పి, దగ్గు, సైనస్, గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి.
కొంతమందికి చల్లటి నీళ్లు తాగిన వెంటనే తలనొప్పి వస్తుంది. వైద్య పరిభాషలో దీనిని ‘బ్రెయిన్ ఫ్రీజ్’ అంటారు. ఇది మెదడులోని సున్నితమైన నరాలను చల్లబరచడం ద్వారా తల వెనుక లేదా ముందు భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
దంతాలు బలహీనంగా ఉన్నా లేదా దంతాల ఎనామెల్ క్షీణించినా చల్లటి నీళ్లు తాగిన వెంటనే జిల్ అని అనిపిస్తుంది. క్రమంగా పంటి నొప్పికి దారి తీస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం దాహం తీర్చుకోవడానికి ఫ్రిజ్లో ఉంచిన నీటి కంటే మట్టి కుండలో ఉంచిన నీటిని తాగడం మంచిది. మట్టి కుండలోని నీళ్లు సహజంగా చల్లబరచడమే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.