Tourist Places: ఈ టూరిస్ట్ ప్లేసులు త్వరలో కనుమరుగవుతాయని తెలుసా?
అందమైన ప్రదేశాలు ఎప్పుడైనా చూడొచ్చు. కానీ, అరుదైన ప్రదేశాలను మాత్రం వీలైనంత త్వరగా చూసేయాలి. ఎందుకంటే.. లేటు చేసేకొద్దీ అవి కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ. మనదేశంలో రకరకాల టూరిస్టు ప్రాంతాలతో పాటు కొంతకాలానికి కనుమరుగయ్యే అరుదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పటికి బాగానే ఉన్నా త్వరలోనే కనిపించకుండా పోతాయి.

మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాల అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఎప్పటికీ అలాగే ఉంటాయని చెప్పలేం. కాలం గడిచే కొద్దీ మెల్లగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సిటీలు పెరగడం, పర్యావరణం కాలుష్యం లాంటి కారణాల వల్ల కొన్ని అందమైన ప్రదేశాలు అంతం అయ్యే చివరి దశలో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మజులీ రివర్ ఐల్యాండ్
మజులీ అనేది ఒక రివర్ ఐల్యాండ్. సాధారణంగా ఐల్యాండ్ లు సముద్రం మధ్యలో ఉంటాయి. కానీ ఇది నది మధ్యలో ఉండే రివర్ ఐల్యాండ్. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులీ ఐల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐల్యాండ్. దీని సౌందర్యాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ ఐల్యాండ్ అంతా స్వచ్ఛంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఏ సీజన్ లో చూసినా ఇక్కడ పచ్చదనమే కనిపిస్తుంది. అయితే డీఫారెస్టేషన్ కారణంగా ఈ ఐల్యాండ్ కుచించుకుపోతుందట. మరో పాతికేళ్లలో ఈ ఐల్యాండ్ వైశాల్యం బాగా తగ్గిపోతుందని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు.
సుందర్బన్ అడవులు
ఇవి మనదేశంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ అడవులు. ఈ అడవులు మూడో వంతు మనదేశంలో మిగతాది బంగ్లాదేశ్ లో ఉంటాయి. ఇది యునెస్కో వారసత్వ సంపద. ప్రస్తుతానికి ఈ అడవుల్లో అన్ని రకాల టూరిస్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ఏటా ఎంతో మంది ఈ అడవుల్ని సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన బెంగాల్ టైగర్స్ ఈ అడవుల్లోనే ఉంటాయి. ఇక్కడ 250 రకాల పులులనే కాకుండా, సుందర్బన్స్ చేతల్ జింక, కింగ్ కోబ్రా, రేసస్ కోతులను కూడా చూడొచ్చు. అయితే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఫ్యూచర్ లో ఈ అడవులు అంతరించే పోయే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు.
ఉలార్ లేక్
జమ్మూకాశ్మీర్లోని బందిపురా జిల్లాలో ఉన్న ఉలార్ ఆసియాలోని అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. ఈ సరస్సులోని నేలల్లో ఉండే విల్లో చెట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు ఈ సరస్సులో వేల రకాల పక్షులు కనిపిస్తాయి. వాటితో పాటు బాతులు, యురేసియన్ పిచ్చుకలు, పొట్టికాళ్ళ గద్దలలతోపాటు హిమాలయన్ మోనాల్, గోల్డెన్ ఓరిలో, హూపోరు, ఇండియన్ రోలర్ లాంటి ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి వచ్చిచేరుతుంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడ రోజురోజుకీ చెట్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. చెట్లు లేకపోతే సరస్సు ఎంతో కాలం పచ్చగా ఉండలేదు. అందుకే ఈ సరస్సు త్వరలో అంతరించొచ్చని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కోరల్ రీఫ్
కోరల్ రీఫ్ అంటే పగడపు దీవుల సముదాయం. లక్షద్వీప్ లో సముద్రం అడుగున ఉండే కోరల్ రీఫ్ వలయాకారంగా ఎంతో అందంగా ఉంటాయి. నీలం రంగులో సముద్రం, తెల్లగా మెరిసే ఇసుక తిన్నెలు కళ్లను కట్టిపడేస్తాయి. అయితే బ్లాస్ట్ ఫిషింగ్, కోరల్ మైనింగ్ కారణంగా ఈ ప్రాంతం కూడా డేంజర్ జోన్ లో ఉంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కూడా దీనిపై ఉంది. రాను రాను సముద్ర మట్టం పెరిగితే ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోనుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




