వాడకం అంటే మనోళ్లదే.. చాట్ జీపీటీ రేసులో తెలంగాణ హవా..
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ముందువరుసలో ఉంటుంది. అందులోనూ తెలంగాణ మరింత ముందుకు దూసుకొస్తోంది. చాట్ జీపీటీ వంటి కొత్త ఆవిష్కరణలను మనోళ్లు తెగ వాడేస్తున్నారట. ఈ వాడకంపై తాజాగా ఓ సర్వే నిర్వహిస్తే తెలంగాణ పౌరులే ఏఐని ఎక్కువగా వాడుతున్నట్టుగా తేలింది. ఐటీ హబ్ వంటి నగరాలుండీ, అక్షరాస్యత విరివిగా ఉన్న కర్నాటక, మహారాష్ట్ర సైతం ఈ రేసులో వెనకబడటం గమనార్హం.

టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఏఐ చాట్ బోట్ చుట్టూనే తిరుగుతోంది. అయితే, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ముందుంటుందన్న విషయం తెలిసిందే. కానీ అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ సత్తాచాటింది. దక్షిణ భారత దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. చాట్ జీపీటి గురించి చేపట్టిన పరిశోధనల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ టాప్ లో నిలిచింది.
ఐటీ సెక్టారే కారణం..
అయితే బిహార్ రాష్ట్రం మాత్రం చాట్ జీపీటి వినియోగంలోనూ వెనకపడే ఉంది. ఈ టెక్నాలజీపై అత్యంత తక్కువ ఆసక్తి చూపుతున్న రాష్ట్రాల్లో బిహార్ ముందువరుసలో ఉంది. ఈ మేరకు గూగుల్ ట్రెండ్స్ సర్వే ద్వారా ఇండియా ఇన్ పిక్సల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 2024 నవంబర్ 3 నుంచి 90 రోజుల పాటు నమోదైన గణాంకాల ఆధారంగా దీనిని వెల్లడించారు. తెలంగాణకు మొత్తంగా 100 స్కోరు రాగా తమిళనాడు 94, కర్నాటక 92, మహారాష్ట్ర 85, కేరళ రాష్ట్రాలు 81 స్కోరును నమోదు చేశాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఐటీ సెక్టార్ బలంగా ఉండటమే దీనికి కారణంగా సదరు కంపెనీ వెల్లడించింది. ఇక చాట్ జీపీటీ వినియోగంలో బిహార్ స్కోరు 22గా నమోదైంది. ఇదే అత్యల్ప స్కోరుగా చెప్తున్నారు. మిజోరం(25), త్రిపుర(33), మణిపుర్(33), నాగాలాండ్(35) రాష్ట్రాలు కూడా తక్కువ స్కోరు సాధించిన లిస్టులో ఉన్నాయి.
భాషే అడ్డంకి..
ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న రాష్ట్రాల్లోనే దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలిపింది. విద్య, ఉపాధిలో ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో ఉన్న వ్యత్యాసమే దీనికి ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది. సాంకేతిక నేపథ్యాలు ఉన్నవారే చాట్ జీపీటీ వంటి సాధనాలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక ఉత్తరాదిలో అత్యధికంగా హ్యూమన్ సైన్స్ చదివేవారే. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్నవారే ఎక్కువగా ఏఐని వాడుతున్నారని తేలింది.