Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..
విజయవాడలో సినిమా స్టైల్లో జరిగిన మోసం సంచలనంగా మారింది. ఫేస్బుక్లో గోల్డ్ ట్రైనింగ్ కంపెనీ యాడ్ చూసి బంగారం విడిపిస్తానంటూ సంప్రదించిన ఓ సివిల్ కాంట్రాక్టర్, నమ్మకం కల్పించి రూ.10.50 లక్షలు ఖాతాలో వేయించుకొని కళ్లుకప్పి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకుని రూ.10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో సినిమా స్టైల్లో సాగిన ఓ మోసం సంచలనంగా మారింది. బంగారం విడిపిస్తామంటూ గోల్డ్ ట్రైనింగ్ కంపెనీని సంప్రదించిన ఓ వ్యక్తి, నమ్మకం కల్పించి ఏకంగా రూ.10.50 లక్షలు తీసుకుని కళ్లుకప్పి పరారయ్యాడు. అయితే బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు కొద్దిసేపటిలోనే నిందితుడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన గొల్ల వెంకటేశ్వరరావు (34) మోతీనగర్లో సివిల్ కాంట్రాక్టర్గా పని చేస్తూ నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఫేస్బుక్లో కనిపించిన ఓ గోల్డ్ ట్రైనింగ్ కంపెనీ యాడ్ చూసిన వెంకటేశ్వరరావు, తాను ఐఐఎఫ్ఎల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని కోరుతూ ఆ సంస్థను సంప్రదించాడు. కంపెనీ ప్రతినిధులు వివరాలు సేకరించగా, వడ్డీతో కలిపి సుమారు రూ.10.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తేలింది. దీంతో ఆ మొత్తాన్ని కంపెనీ ప్రతినిధులు వెంకటేశ్వరరావు ఖాతాలోకి బదిలీ చేశారు.
డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం కంపెనీ ప్రతినిధులు సెక్యూరిటీ చెక్కులు ఇవ్వాలని కోరగా.. వెంకటేశ్వరరావు “ప్రస్తుతం నా దగ్గర ఒక చెక్ మాత్రమే ఉంది, మిగతావి ఇంటి దగ్గర ఇస్తా” అంటూ నమ్మించాడు. అనంతరం కంపెనీ ఎగ్జిక్యూటివ్ను తన బైక్పై ఎక్కించుకొని ఈఎస్ఐ ఆసుపత్రి వెనుక ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ.. ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్లిన వెంకటేశ్వరరావు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుక గేటు నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. తమను మోసం చేశారని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని గాలించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
