తెలంగాణలో వెరైటీ సీన్… రివర్స్ మేగ్రేషన్ మొదలైంది!
దేశమంతటా తమ సొంతూళ్ళకు బయలు దేరిన వలస కార్మికులు, వర్కర్లు కనిపిస్తుంటే తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి శుక్రవారం నుంచి మొదలైంది. వలస కార్మికులు తెలంగాణలో పని చేసేందుకు మొగ్గు చూపుతూ రాష్ట్రానికి తిరిగి వస్తున్న దృశ్యాలు శుక్రవారం ఆవిష్కృతమయ్యాయి.
దేశమంతటా తమ సొంతూళ్ళకు బయలు దేరిన వలస కార్మికులు, వర్కర్లు కనిపిస్తుంటే తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి శుక్రవారం నుంచి మొదలైంది. వలస కార్మికులు తెలంగాణలో పని చేసేందుకు మొగ్గు చూపుతూ రాష్ట్రానికి తిరిగి వస్తున్న దృశ్యాలు శుక్రవారం ఆవిష్కృతమయ్యాయి. తొలివిడతగా బీహార్ రాష్ట్రానికి చెందిన 225 మంది వలస కార్మికులు హైదరాబాద్కు చేరుకున్నారు. దీనికి కారణమేంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.
దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు తమ స్వ రాష్ట్రాలకు తరలి వెళ్తుండగా హైదరాబాద్ నగరానికి మాత్రం బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుండి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో వందలాది మంది వలస వర్కర్లు తరలి వచ్చారు. 225 మంది శుక్రవారం నగర శివారులోని లింగంపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అజయ్ కుమార్. సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్; రైతు బంధు ఛైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన వలస వర్కర్లకు పుష్పాలందించి మరి స్వాగతం పలికారు.
హైదరాబాద్ నగరానికి వచ్చిన వలస కూలీలు ప్రధానంగా రైస్ మిల్లులలో పనిచేయడానికి వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కూలీలను నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేట ప్రాంతాలకు ప్రత్యేక బస్సులలో తరలించింది రాష్ట్ర పాలనా యంత్రాంగం. వచ్చిన కూలీలకు వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం సంబంధిత జిల్లాలకు తరలించామని, వారికి వాటరు బాటిళ్ళు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు, అందజేశామని అధికారులు తెలిపారు.