మునిసిపల్ ఎన్నికలకు గులాబీ వ్యూహం ఇదే!
తెలంగాణ పట్టణాల్లో ఓటర్లు ఏమనుకుంటున్నారు..? టీఆర్ఎస్ ప్రభుత్వంపై వారి మనసులోని మాట ఏంటి…? అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన అర్బన్ ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదు. మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న టీఆర్ఎస్ పార్టీ… పట్టణాల్లో ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. వారం రోజుల్లో అర్బన్ ఓటరు నాడీపై నివేదిక ఇవ్వాల్సింది ఎన్నికల ఇంచార్జీ లను అదేశించింది తెలంగాణ భవన్. ఏడాది కాలంలో తెలంగాణలో పలు దఫాలుగా వివిధ ఎన్నికలు జరిగాయి. 2018 […]
తెలంగాణ పట్టణాల్లో ఓటర్లు ఏమనుకుంటున్నారు..? టీఆర్ఎస్ ప్రభుత్వంపై వారి మనసులోని మాట ఏంటి…? అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన అర్బన్ ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదు. మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న టీఆర్ఎస్ పార్టీ… పట్టణాల్లో ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. వారం రోజుల్లో అర్బన్ ఓటరు నాడీపై నివేదిక ఇవ్వాల్సింది ఎన్నికల ఇంచార్జీ లను అదేశించింది తెలంగాణ భవన్.
ఏడాది కాలంలో తెలంగాణలో పలు దఫాలుగా వివిధ ఎన్నికలు జరిగాయి. 2018 డిసెంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2019 మే నెలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యలో పరిషత్ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్గా ఓట్లు వేసిన జనం.. 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో.. సైడయిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ వైపే నిలబడ్డారు ఓటర్లు. లోక్ సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు.. టీఆర్ఎస్ వైపే నిలబడ్డా… పట్టణాల్లో నివసించే ఓటర్లు .. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేశారు. టీఆర్ఎస్ గెలిచిన లోక్ సభ నియోజకవర్గాల్లోనూ అర్బన్లో తక్కువ ఓట్లు వచ్చాయి.. దీంతో పట్టణాల్లో ఉన్న ఓటర్ల నాడి టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు పలకలేదని అర్థం అయింది.
లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్. ఆదిలాబాద్ , భువనగిరి, నల్గొండలతో పాటు… గ్రేటర్ హైదరాబాద్లోని రెండు ముఖ్యమైన సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది? ఇందుకు గల కారణాలను విశ్లేషించే పనిలో భాగంగా అప్పటి నుండే అర్బన్ ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయినా… పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు ఎందుకు వచ్చిందనే దానిపై సమీక్షలు నిర్వహించారు కేసీఆర్. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ వాదం పనిచేసినందుకే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారా? లేక ప్రభుత్వంపై వ్యతరేకత ఉందా అన్న దానిపై అర్బన్ ఏరియాల్లో పార్టీ సర్వేలు నిర్వహిస్తునే మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీల ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లతో సహా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి… మొదటిసారి పూర్తి పట్టు సాధించింది. ఇప్పటికే పట్టణాల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టు సడల లేదని భావిస్తున్నా… పార్లమెంట్ రిజల్ట్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అనుమానం మొదలైంది…పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్కు మొత్తం 41.29 శాతం ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ 29.48, బీజేపీ 19.45 శాతం ఓట్లు పడ్డాయి…ఆదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి 50వేల మెజారిటీ, కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి 80 వేల మెజారిటీ, నిజామాబాద్ బిజెపి అభ్యర్థి 70వేల మెజారిటీ, నల్గొండ లో కాంగ్రెస్ అభ్యర్థి 25వేల మెజారిటీ, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి 5 వేల మెజారిటీతో టిఆర్ఎస్ మీద గెలుపొందారు. దీంతో అధికార పార్టీ పోస్టుమార్టం ప్రకారం అర్బన్ ఓటర్లు బిజెపి, కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తుంది.
ఇక మున్సిపల్ చట్ట సవరణ చేసి.. ఎన్నికలకు వెళ్తున్న గులాబీ పార్టీ ముందునుంచే అర్బన్ ఓటర్లు గురిపెట్టింది… పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని తగు వ్యూహాలను రచిస్తోంది…లోలోపల జాగ్రత్తలు పడుతూనే పార్టీ నాయకులు బయటకు మాత్రం ‘‘ఎంపీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు తేడా ఉంటుంది. ఈ ఎన్నికల్లో విజయం తమదే‘‘ అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.