వికారాబాద్ జిల్లాలో దారుణం… నిద్రిస్తున్న తండ్రిని బండరాయితో మోది చంపిన కొడుకు.. ఆస్తి, రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని ఘాతుకం..

రాను రాను మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తసంబంధీకులే కాలయములవుతున్నారు. ఆస్తి, రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని ఓ కొడుకు ఘాతుకానికి ఒడిగట్టాడు.

వికారాబాద్ జిల్లాలో దారుణం... నిద్రిస్తున్న తండ్రిని బండరాయితో మోది చంపిన కొడుకు.. ఆస్తి, రైతు బంధు డబ్బులు  ఇవ్వడం లేదని ఘాతుకం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 24, 2020 | 4:30 PM

రాను రాను మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తసంబంధీకులే కాలయములవుతున్నారు. ఆస్తి, రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని ఓ కొడుకు ఘాతుకానికి ఒడిగట్టాడు. నిద్రిస్తున్న కన్నతండ్రిని అతి కిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు.ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం సంగెంఖుర్దు గ్రామానికి చెందిన చింతల రుస్తుం(55) భార్య 15 ఏళ్ల క్రితం మృతి చెందింది. ప్రస్తుతం తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ.. కుమారులతో కలిసి ఉంటున్నాడు. కాగా, రుస్తుం పెద్ద కొడుకు శేఖర్‌ జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు. డబ్బుల కోసం తరచూ తండ్రిని వేధించేవాడు. ప్రభుత్వం అందించే రైతు బంధు డబ్బులు ఇవ్వాలంటూ తరుచూ వేధింపులకు గురిచేశాడు. ఇందుకు తండ్రి నిరాకరించడంతో తన వాటా అస్తిని పంచాలంటూ ఘర్షణకు దిగాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. ఇదే క్రమంలో రుస్తుం ఆదివారం రాత్రి వరి పంటకు కాపాలాగా పొలం వద్ద నిద్రించాడు. డబ్బులు ఇవ్వడంలేదన్న కోపంతో పొలం వద్ద నిద్రిస్తున్న తండ్రిపై బండరాయితో మోది హత్య చేశాడు శేఖర్‌. అనంతరం ఇంటికి వెళ్లి ఏం తెలియదన్నట్లు నిద్రపోయాడు.

సోమవారం తెల్లవారుజామున చుట్టుపక్కల రైతులు రుస్తుం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించగా, జాగిలాలు నేరుగా శేఖర్‌ వద్దకు వెళ్లి అతడి చొక్కా పట్టుకున్నాయి. దీంతో పోలీసులు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. తండ్రి రుస్తుం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకు శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.