AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్?

భారతదేశ అణు ఇంధన రంగంలో అత్యంత సున్నితమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి. తమిళనాడులోని, దేశంలోనే అతిపెద్దదైన కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించిన అత్యంత రహస్యమైన డేటా లీక్ అయినట్లు వార్తలు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 'వరల్డ్ లీక్స్' అనే హ్యాకర్ల బృందం ఈ అణు ప్లాంట్‌కు సంబంధించిన సుమారు 19,000 సున్నితమైన దస్తావేజులను బహిర్గతం చేసింది. ఇందులో ప్లాంట్ భాగాల బ్లూప్రింట్లు, కీలక పరికరాల సమీక్షలు, కాంట్రాక్టర్లు, సరఫరాదారుల సమాచారం, అంతర్గత సమావేశాలు, తనిఖీల నివేదికలతో పాటు బీమా పాలసీలకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్?
Kudankulam, Nuclear Power Plant,
Balaraju Goud
|

Updated on: Jul 15, 2026 | 6:06 PM

Share

భారతదేశ అణు ఇంధన రంగంలో అత్యంత సున్నితమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి. తమిళనాడులోని, దేశంలోనే అతిపెద్దదైన కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించిన అత్యంత రహస్యమైన డేటా లీక్ అయినట్లు వార్తలు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ‘వరల్డ్ లీక్స్’ అనే హ్యాకర్ల బృందం ఈ అణు ప్లాంట్‌కు సంబంధించిన సుమారు 19,000 సున్నితమైన దస్తావేజులను బహిర్గతం చేసింది. ఇందులో ప్లాంట్ భాగాల బ్లూప్రింట్లు, కీలక పరికరాల సమీక్షలు, కాంట్రాక్టర్లు, సరఫరాదారుల సమాచారం, అంతర్గత సమావేశాలు, తనిఖీల నివేదికలతో పాటు బీమా పాలసీలకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం.

రిలయన్స్ సర్వర్ల నుంచే డేటా చోరీ?

లీకైన ఈ పత్రాలు కుడంకుళం అణు ప్లాంట్‌కు కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు చెందినవని హ్యాకర్ల గ్రూప్ పేర్కొంది. ఈ డేటా లీక్‌పై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పందిస్తూ.. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ తమ డేటా పాక్షికంగా చోరీకి గురైనట్లు అంగీకరించిందని వెల్లడించింది. థర్డ్-పార్టీ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ‘యోటా’ సర్వర్లలో భద్రపరిచిన డేటాపై ఈ సైబర్ దాడి జరిగినట్లు ఆ సంస్థ గుర్తించింది. ఈ సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనపై రిలయన్స్ గ్రూప్ ఇప్పటికే భారత ప్రభుత్వానికి, భద్రతా సంస్థలకు అధికారికంగా సమాచారం అందించింది. అయితే, ఏ స్థాయి సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కిందనేది గోప్యంగా ఉంచారు.

అణు ప్లాంట్ భద్రతకు తీవ్ర ముప్పు!

ప్రపంచవ్యాప్తంగా అణు భద్రతా ప్రమాణాలను అంచనా వేసే ‘న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్’ సీనియర్ డైరెక్టర్ నికోలస్ రోత్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు వెన్నెముక లాంటి అణు కేంద్రాల సమాచారం లీక్ కావడం ప్లాంట్ల భద్రతకు పెను ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. రాయిటర్స్ పరిశీలన ప్రకారం.. 2016 నుంచి 2025 మధ్య కాలానికి చెందిన ఫైళ్లు లీక్ కాగా, వరల్డ్ లీక్స్ వెబ్‌సైట్‌లో ఉన్న మొత్తం 8.58 లక్షల రిలయన్స్ ఫైళ్లలో 19 వేలకు పైగా దస్త్రాలు అత్యంత కీలకమైనవని తేలింది. 2018లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దక్కించుకున్న కుడంకుళం 3, 4 యూనిట్ల నిర్మాణ కాంట్రాక్టుకు సంబంధించిన డిజైన్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు యూనిట్లు 2027 నాటికి అందుబాటులోకి వచ్చి 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది.

ఎవరీ ‘వరల్డ్ లీక్స్’ హ్యాకర్లు?

ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి డేటాను దొంగిలించడం, ఆపై భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం ఈ ‘వరల్డ్ లీక్స్’ గ్రూప్ ప్రధాన పని. ఒకవేళ సదరు సంస్థలు డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తే, ఆ గుప్త సమాచారాన్ని డార్క్ వెబ్‌లో లీక్ చేసి, బహిరంగంగా వేలం వేస్తారు. గతంలో నైక్ కంపెనీతో పాటు, భారత దిగ్గజం టాటా గ్రూప్‌ను కూడా వీరు లక్ష్యంగా చేసుకున్నారు. గతేడాది జూన్‌లో టాటా గ్రూప్ నుంచి ఆపిల్, టెస్లా వంటి అంతర్జాతీయ బ్రాండ్ల రహస్య డిజైన్లను దొంగిలించిన హ్యాకర్లు.. 1.5 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు. కంపెనీ లొంగకపోవడంతో ఆ డేటాను నెట్‌లో పెట్టారు. ఇప్పుడు నేరుగా భారత అణు కేంద్రం సమాచారమే లీక్ కావడం దేశ రక్షణ, సైబర్ భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని సవాల్ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us