ట్రంప్ అభిశంసన విచారణకు ముందు ఒక్కొక్కరుగా వీడుతున్న లాయర్లు, చిక్కుల్లో మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సంబంధించిన విచారణ మరో వారం రోజుల్లో జరగనుండగా ఆయన తరఫున వాదించనున్న..
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సంబంధించిన విచారణ మరో వారం రోజుల్లో జరగనుండగా ఆయన తరఫున వాదించనున్న పలువురు లాయర్లు ఒక్కొక్కరుగా ఆయనను వీడుతున్నారు. ఈ టీమ్ కి నేతృత్వం వహిస్తున్న ఇద్దరితో సహా ఐదుగురు లాయర్లు ఆయనకు దూరమయ్యారు. ట్రంప్ లీగల్ స్ట్రాటజీతో వారు విభేదిస్తునట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం తన దోషిత్వానికి సంబంధించిన లీగాలిటీ మీద ఫోకస్ పెట్టే బదులు, ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందంటూ నిరాధార ఆరోపణలను కొనసాగిస్తున్నారని ఈ న్యాయవాదులు విసుక్కుంటున్నారు. ఆయనకు ముఖం చాటేస్తున్నారు. పరస్పర నిర్ణయంతో తాము ఈ చర్య తీసుకున్నట్టు ఈ లాయర్లు చెబుతున్నారు. కాగా వీరి నిర్ణయాన్ని మార్చడానికి తాము ఎంతో కృషి చేశామని, ఏమైనా తమ లీగల్ టీమ్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ సలహాదారు జేసన్ మిల్లర్ తెలిపారు.
ట్రంప్ అభిశంసన విచారణకు ముందు ఆయన లాయర్లు దూరమవడం మాత్రం ఆయనకు ఎదురుదెబ్బే..ఇక రిపబ్లికన్లలో చాలామంది ట్రంప్ విచారణను వ్యతిరేకిస్తున్నారు. దానికి బదులు అభిశంసిస్తే చాలునని వారు అంటున్నారు. అయితే ఇప్పటికే ఆయనను అభిశంసించిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం సభలో నెగ్గింది కూడా.. ఫిబ్రవరి 9 నుంచి ట్రంప్ విచారణ ప్రారంభం కానుంది. ఇది జరగాలని కోరుతున్న 50 మంది డెమొక్రాట్లతో బాటు ఐదుగురు రిపబ్లికన్లు కూడా వారికి మద్దతు పలుకుతున్నారు. 17 మంది రిపబ్లికన్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయకపోవచ్చ్చునని భావిస్తున్నారు.