AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ పెరుగుతున్న ప్రవాహం

మరోసారి కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు నీటితో నిండిపోవడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువున ఉన్న కృష్ణా నది నీటిమట్టం పెరుగుతోంది. పశ్చిమ కనుమల్లో కూడా సోమవారం వర్షాలు కురవడంతో ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. పెరిగిన వరదనీటితో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి 7 […]

ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ పెరుగుతున్న ప్రవాహం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 04, 2019 | 3:58 PM

Share

మరోసారి కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు నీటితో నిండిపోవడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువున ఉన్న కృష్ణా నది నీటిమట్టం పెరుగుతోంది. పశ్చిమ కనుమల్లో కూడా సోమవారం వర్షాలు కురవడంతో ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. పెరిగిన వరదనీటితో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి 7 గంటలకు 31,135 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్టుగా నమోదైంది. బ్యారేజీ నీటి నిల్వ 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో 20 వేల క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నారు. మిగిలిన నీటిని బ్యారేజీ పది గేట్లు ఎత్తి ఒక్క అడుగు మేర సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

పదేళ్ల తర్వాత గత ఆగస్టు నెలలో  కృష్ణా నదికి రికార్డు స్ధాయిలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పోటెత్తిన విషయం తెలిసిందే. భారీగా వచ్చి చేరిన నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయగా.. మిగిలిన నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు, వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. దీనికోసం బ్యారేజ్ వద్ద అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు మంత్రులు అనిల్, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా పరిస్థితిని అంచనా వేస్తూ వచ్చారు. బాధితులకు వెంటనే సహాయ సహకారాలు అందించేందుకు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సిబ్బందిని నియమించి పర్యవేక్షించారు.  గత నెలలో సంభవించిన వరదల కారణంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో 63 గ్రామాలు ప్రభావితమైనట్టు ప్రభుత్వం తేల్చింది. కృష్ణా వరదలతో 935 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 678 హెక్టార్ల మేర పంటనష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తెలిపింది.