AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్..

అది నుంచి ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్..
Balaraju Goud
|

Updated on: Nov 03, 2020 | 6:32 PM

Share

అది నుంచి ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే సాధార‌ణ ఓట‌ర్ల‌కు ఓటేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. చివ‌రి గంట‌లో కేవ‌లం కొవిడ్ రోగుల‌కు మాత్ర‌మే ఓటు వేసేందుకు వెసులుబాటు క‌ల్పించారు. కరోనాతో బాధపడుతున్న వారు పీపీఈ కిట్లను ధరించి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక పోరులో మొత్తం 23 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. వీరి భ‌విత‌వ్యాన్ని ఓట‌ర్లు ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం 10వ తేదీన తేల‌నుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సోలిపేట సుజాత పోటీలో ఉండగా, బీజేపీ తరుపున రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మంగళవారం ఉప ఎన్నిక నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలో దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలు, మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగి మండలాల్లో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన‌ 89 పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. భారీగా పోలీసులతో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. 400 మంది పీవోలు, 400 మంది ఏపీవోలు, 800 మంది అదనపు పోలింగ్‌ అధికారులు ఎన్నిక‌ల విధులు నిర్వ‌ర్తించారు. కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కొవిడ్ నిబంధనలను అమలు చేశారు. ప్రత్యేకంగా ఓటర్లను థర్మల్ స్కీనింగ్ చేసిన తర్వాతే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే మాస్కులు ఉన్న ఓటర్లను మాత్రమే అనుమతించారు.