దిల్లీ: సైనికుల పోరాట సామర్థ్యానికి మరింత సానబెట్టేందుకు ఆధునిక తుపాకులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. అధునాతన 7.62 ఎమ్ఎమ్ అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన సిగ్ సావర్ సంస్థతో భారత్ ఒప్పందం చేసుకుంది. సమారు రూ.700 కోట్లు వెచ్చించి 72,400 రైఫిళ్లను సమకూర్చుకుంటోంది. త్వరితగతి కొనుగోళ్ల ప్రక్రియ (ఎఫ్టీపీ) కింద చేసుకున్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రక్షణశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అమెరికాతోపాటు ఐరోపాలోని మరికొన్ని దేశాల దళాలు వినియోగిస్తున్న ఈ తుపాకులు ఏడాదిలోపే భారత్ చేతికి వస్తాయని చెప్పారు.
నావి హెలికాప్టర్ల పెంపు యోచన విదేశీ సంస్థలతో కలిసి భారత నావికాదళం కోసం 111 హెలికాప్టర్లను ‘భారత్లో తయారీ’ కింద దేశీయంగా తయారు చేసి ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి రక్షణ శాఖ స్పందనలను కోరింది. సోవియట్ తరం హెలికాప్టర్ల స్థానంలో కొత్తవాటిని తీసుకువచ్చేందుకు ఈ చర్య తీసుకుంటోంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.21వేల కోట్లు.
రష్యా నుంచి మిగ్-29 యుద్ధవిమానాలు
మన దగ్గర వేగంగా తగ్గిపోతున్న యుద్ధవిమానాల సంఖ్యను పూరించుకునేందుకు భారత వైమానిక దళం రష్యా నుంచి ఇరవై ఒక్క మిగ్-29 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇవి 1980ల నుంచి రష్యాలో విడిభాగాల రూపంలో ఉన్నాయి.