సీఎం జగన్ నిర్ణయాలపై కేంద్రం అభినందనలు..:మంత్రి మేకపాటి
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి - కేంద్ర ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిశారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సహకారం కోరారు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి – కేంద్ర ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిశారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సహకారం కోరారు మంత్రి గౌతమ్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సచివాలయం తరహా ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. మరో ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలన్నారు.
ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయతో మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. సాగరమాల పథకం కింద కాకినాడ పోర్టులో వసతుల కల్పన అభివృద్ధికి సహకరించాలని కోరారు. భారతమాల కార్యక్రమంలో భాగంగా పోర్టుల చుట్టూ జాతీయ రహదారుల అనుసంధానంపై చర్చించారు. భావనపాడు, కాకినాడ సెజ్ పోర్ట్, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల సమీపంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కేంద్ర సాయం అభ్యర్థించారు.
వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్తోనూ మేకపాటి సమావేశం అయ్యారు. విశాఖ -చెన్నై కారిడార్ అభివృద్ధి గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పది ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేయబోతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు. ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక మేజర్ పోర్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కావాలనుకుంటుందని, దానిపై సీఎం తో మాట్లాడి ముందుకెళ్తామని తెలిపారు. కరోనా సంక్షోభ కాలంలో చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నెంబర్వన్గా నిలవడాన్ని పీయూష్ గోయల్ ప్రశంసించారని మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు