Andhra: ఏంట్రా ఇలా ఉన్నారు.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో దారుణం చోటుచేసుకుంది. తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా కిరాణా షాపు యజమానిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయాలకే పెరిగిపోతున్న హింసకు ఈ ఘటన నిదర్శనం..

సొసైటీలో కొంతమంది మరీ దారుణంగా తయారయ్యారు. చిన్న చిన్న విషయాలకే.. కిరాతకంగా మారుతున్నారు. పది రూపాయల కోసం హత్యలు.. చిన్న మాటకే హత్యలు చేసే వారి గురించి వింటున్నాం.. చూస్తున్నాం.. తాజాగా, అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని కిరాణా షాప్ యజమాని పై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.. ఈ దారుణ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో జరిగింది. ముదిగుబ్బ మండల కేంద్రంలో మణికంఠ అనే వ్యక్తి కిరణా దుకాణం యజమాని.. ఎప్పటిలా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.. ఈ క్రమంలో మణికంఠ కిరణా షాప్ లో వసంత్ కుమార్ అనే డ్రైవర్ 200 రూపాయలు అప్పు ఉన్నాడు.
200 రూపాయల అప్పు అలా ఉండగానే.. సిగరెట్ అప్పుగా కావాలని డ్రైవర్ వసంత్ కుమార్ అడిగాడు.. అయితే.. గతంలో ఇవ్వాల్సిన 200 రూపాయలు ఇవ్వాలని షాపు యజమాని మణికంఠ తల్లి డ్రైవర్ వసంత్ కుమార్ ను అడిగింది. దీంతో డ్రైవర్ వసంత్ కుమార్ షాప్ యజమాని తల్లితో గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో.. అడ్డువచ్చిన షాపు యజమాని మణికంఠ పై డ్రైవర్ వసంత కుమార్ కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ కిరాణా షాపు ఓనర్ మణికంఠను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మణికంఠకు చికిత్స అందిస్తున్నారు.
గతంలో ఉన్న బాకీ 200 రూపాయలు చెల్లిస్తేనే సిగరెట్ ఇస్తానన్నందుకు.. కత్తితో పొడిచినట్లు కిరాణా షాప్ యజమాని మణికంఠ చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కేవలం సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని దాడి చేయడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
