AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికాసేపట్లో.. తెలంగాణ కేబినెట్ భేటీ.. ఇవే కీలకం..!

కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్‌ సమావేశం ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరికాసేపట్లో.. తెలంగాణ కేబినెట్ భేటీ.. ఇవే కీలకం..!
Sanjay Kasula
|

Updated on: Aug 05, 2020 | 1:27 PM

Share

Key Meeting of The Telangana Cabinet : స్కూల్స్ ఓపెన్ చేయడానికి సాధ్యాసాధ్యాలేంటి? రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు ఎలా ఉంది? కొత్త విద్యా విధానం ఎలా ఉండాలి? కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయా? ఇలా వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కాబోతుంది తెలంగాణ కేబినెట్.  కొత్త సచివాలయ నమునాను ఇప్పటికే ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్‌ సమావేశం ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం, భవన నమూనాల అంశంపై ప్రధానంగా చర్చ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఎలాంటి యాక్షన్‌ ఉండాలన్న దానిపైన చర్చ జరుగుతుంది. విద్యా రంగంపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా కారణంగా పలు ఎంట్రన్స్‌లు, డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఎప్పుడు నిర్వహించాలి, స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరవాలన్న దానిపైనా మంత్రివర్గంలో చర్చ ఉండే అవకాశం ఉంది. కొత్త విద్యా విధానం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియంత్రిత వ్యవసాయ విధానం, అమలవుతున్న తీరుపై సమీక్ష ఉండనుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాన్ని రైతులు పాటిస్తున్నారని భావిస్తోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో దానిపై సమీక్షించి మరికొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది.

వీటితో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు, రైతులకు కొత్త పథకం ప్రకటనపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఉద్యోగులకు తీపికబురు అందుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.