AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రెండు నగరాలపై జగన్ ఫోకస్.. ఇక లాక్ డౌన్ కఠినం

శుక్రవారం మధ్యాహ్నం కరోనా స్థితిగతులపై సమీక్ష జరిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా రెండు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, లాక్ డౌన్ మరింత పక్కాగా, కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ రెండు నగరాలపై జగన్ ఫోకస్.. ఇక లాక్ డౌన్ కఠినం
Rajesh Sharma
|

Updated on: Apr 24, 2020 | 4:14 PM

Share

ఏపీలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా రెండు నగరాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా స్థితిగతులపై సమీక్ష జరిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా రెండు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, లాక్ డౌన్ మరింత పక్కాగా, కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం నాటి సమీక్షలో కర్నూలు, గుంటూరు నగరాల్లో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ రెండు నగరాల్లో కూడా అన్ని ప్రాంతాలకూ వైరస్ విస్తరించలేదని, వైరస్‌ ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితమైందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రికి వివరించారు. ఇక్కడ వైరస్‌ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో సీఎం మార్గ నిర్దేశం చేశారు.

ఈ ప్రాంతాల్లోని ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు ఉంచడం ద్వారా కంటైన్‌ మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. కుటుంబంలో ఒకరికి పాసు ఇచ్చి, నిత్యావసరాలకు ఆవ్యక్తిని మాత్రమే వీధిలో అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

వైద్యం కోసం టెలిమెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందని శుక్రవారం నాటి సమీక్షలో అధికారులు తెలిపారు. 8,395 మంది ఇప్పటి వరకూ టెలిమెడిసిన్‌ ద్వారా డాక్టర్లను సంప్రదించారన్న అధికారులు.. వారందరి సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. తెలంగాణ తరహాలో ఏపీలో డీఆర్డీఓ ద్వారా మొబైల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఎం నిర్ణయించారు.

వలస కూలీలు, వివిధ క్యాంపుల్లో ఉన్నవారిని పరీక్షించడానికి మొబైల్ ల్యాబ్ ఉపయోగపడుతుందన్నారు. టమోటా, ఉల్లి, చీనీ పంటలు సహా ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్, ధరలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతు బజార్లను వీలైంత ఎక్కువగా వికేంద్రీకరించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఈ రైతుబజార్లకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.