ఏపీ వచ్చే విదేశీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. క్వారంటైన్ నుంచి మినహాయింపు!
కరోనా నిబంధనలు ప్రకారం విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా వారం రోజుల పాటు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో ఉండాలి. అయితే ఇప్పుడు దాని నుంచి మినహాయింపు పొంది నేరుగా ఇంటికి వెళ్లే అవకాశం లభించనుంది.
Air Suvidha Portal In AP: కరోనా నిబంధనలు ప్రకారం విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా వారం రోజుల పాటు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో ఉండాలి. అయితే ఇప్పుడు దాని నుంచి మినహాయింపు పొంది నేరుగా ఇంటికి వెళ్లే అవకాశం లభించనుంది. దీని కోసం ప్రయాణీకులు ఎయిర్ సువిధ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్ ద్వారా విదేశీ ప్రయాణీకులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను పూర్తి చేయడమే కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్ పోర్టల్ను కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్తోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో రూపొందించినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(డీఐఏఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇవాళ్టి నుంచి ఈ వెబ్సైట్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ అందుబాటులో ఉండనుంది. వివిధ ఫారాలను భౌతికంగా తాకే పని లేకుండా ప్రయాణీకులు కాంటాక్ట్ లెస్ పద్దతిలో ఈ ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఇక క్వారంటైన్ కోరే ప్రయాణీకులు మాత్రం ఐదు నిర్దిష్టమైన విభాగాల కింద ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెబ్సైట్లో www.newdelhiairport.inలో ఈ-ఫారంను నింపాలని.. విమానం బయల్దేరే 72 గంటల ముందుగా సంబంధిత డాక్యూమెంట్స్, పాస్ పోర్టు కాపీలను ఈ-ఫారంకు జత చేయాలని తెలిపారు. అయితే ప్రయాణీకులు పూర్తి చేయాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంకు మాత్రం ఎలాంటి కాలపరిమితి ఉండదని సూచించారు. దీనితో విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయాణీకులకు ఊరట లభించనుంది.