ముంబయి: సరికొత్త ఆన్లైన్ మార్కెటింగ్ రూల్స్ తో అమెజాన్ సతమతమవుతోంది. దీని నుంచి కోలుకోకుండా కొత్త సంస్థలను కొనుగోళ్లు చేయకూడదని భావించినట్లు తెలుస్తోంది. దీంతో కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కోనుగోలును కూడా తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లు. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీలకు వాటాలు ఉన్న సంస్థల్లో వస్తువులను అమ్మడం కుదరదు. దీంతో అమెజాన్ రాత్రికిరాత్రే తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రిటైల్ రంగ సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయడం అమెజాన్కు ఇక కుదరకపోవచ్చు. భారత్లో పరిస్థితి అమెజాన్ యాజమాన్యాన్ని కొంచెం ఇబ్బంది పెడుతోంది.

తగ్గిన స్ఫీడు–
గత ఏడాది ఆఫ్లైన్ రిటైల్ వ్యాపారాల కొనుగోలులో అమెజాన్ దూకుడుగా వ్యవహరించింది. చాలా సంస్థలతో కొనుగోళ్లకు సంబంధించి చర్చలు జరిపింది. వీటిల్లో ఆర్పీ-ఎస్జీ గ్రూప్, స్పెన్సర్, ఫ్యూచర్ గ్రూప్లు ఉన్నాయి. దాదాపు 2 బిలియన్ డాలర్లను వెచ్చించి దేశంలో ఆఫ్లైన్ మార్కెట్పై పట్టు సాధించేందుకు అమెజాన్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో సెప్టెంబర్లో ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన మోర్ రిటైల్లో దాదాపు 49శాతం వాటాలను కొనుగోలు చేసింది. అదే ఊపులో ఫ్యూచర్ గ్రూప్తో కూడా డీల్ పూర్తి చేద్దామని అనుకొంది. దీనిలో భాగంగానే దాదాపు 15 శాతం వాటా కోసం ఫ్యూచర్ గ్రూప్లో 700 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తూ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కూడా ఈ మొత్తం షేర్లను నగదుకు విక్రయించకుండా అమెజాన్ ఇండియాలో వాటా పొందవచ్చని భావించింది.
అప్పట్లో అమెజాన్ ఇండియా విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు. ఈ డీల్ 2019 తొలి త్రైమాసికంలో పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం హఠాత్తుగా కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఈ డీల్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతోపాటు షాపర్స్ స్టాప్లో వాటాను 5 శాతం నుంచి మరింత పెంచుకోవాలన్న ప్రతిపాదనలను కూడా అమెజాన్ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కొత్త నిబంధనల ప్రభావం తమ వ్యాపార భాగస్వాములు, వినియోగదార్లపై ఏ మేరకు ఉందో అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని అమెజాన్ భావిస్తోంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి