నాలాలో కొట్టుకుపోయిన నవీన్ శవమై తేలాడు
సరూర్నగర్ నాలాలో గల్లంతైన నవీన్ కుమార్ మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. ఆయన మృతదేహం సోమవారం సరూర్నగర్ చెరువులో లభించింది.
హైదరాబాద్ మహానగరంలో వరదలు విలయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ మ్యాన్ హోల్ 12 ఏళ్ల చిన్నారి ప్రాణాలు బలి తీసుకోగా అలాంటిదే మరో విషాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయి శవమై తేలాడు. ఆదివారం సాయంత్రం సరూర్నగర్ నాలాలో గల్లంతైన నవీన్ కుమార్ మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. ఆయన మృతదేహం సోమవారం సరూర్నగర్ చెరువులో లభించింది. ఆదివారం కురిసిన భారీవానతో రహదారులను వరద నీరు ముంచెత్తింది. దీంతో నిన్న సాయంత్రం స్కూటీపై వెళ్లిన నవీన్ కుమార్ వరదలో చిక్కుకుని తపోవన్ కాలనీలోని నాలాలో గల్లంతయ్యాడు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అతడు అందులోనే కొట్టుకుపోయాడు. దీంతో అతని కోసం డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 20 గంటలపాటు గాలించాయి. చివరకు ఈరోజు సాయంత్రం సరూర్నగర్ చెరువులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
తపోవన్ కాలనీకి చెందిన నవీన్ కుమార్ బైక్పై తన ఇంటికి వెళ్తున్నాడు. అప్పటికే వర్షపు నీటితో వరద ఉదృతంగా ఉండటంతో అది దాటే క్రమంలో బైక్ అదుపుతప్పింది. వరద నీటిలో పడిపోవడంతో ఉధృతికి సరూర్నగర్ చెరువులోకి కొట్టుకుపోయారు. చెరువులో బురద, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరగడం పలువురిని కలిచివేసింది. కాగా, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.