గ్రేటర్ లో మాస్క్ ధరించని 5,500 మందికి జరిమానా
బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కానీ, ఈ నిబంధనను ప్రజలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న గ్రేటర్ పరిధిలోని అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.
కరోనా కరాళనృత్యానికి జనం అల్లాడిపోతున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, కరోనా కట్టడిలో భాగంగా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది సర్కార్. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కానీ, ఈ నిబంధనను ప్రజలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న గ్రేటర్ పరిధిలోని అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.
సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో మే, జూన్ నెలల్లో 5,500 కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులన్నీ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బీ) కింద నమోదు చేసినట్లు వెల్లడించారు. మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఒక్క రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 3 వేల కేసులు నమోదు కాగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 వేల కేసులు నమోదు అయ్యాయి. మాస్కు ధరించని వారితో పాటు ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కూడా గుర్తిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోనే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ లు ధరించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని అధికారులు వెల్లడించారు.