AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana PSUs: ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలకు ఆలవాలం తెలంగాణ.. అదంతా గత చరిత్రేనా?

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించ వద్దంటూ ఆందోళన చేస్తున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణలో మూతపడిన లేదా ప్రైవేటుపరం అయిన ఫ్యాక్టరీల గురించి ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.

Telangana PSUs: ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలకు ఆలవాలం తెలంగాణ.. అదంతా గత చరిత్రేనా?
07
Rajesh Sharma
|

Updated on: Mar 13, 2021 | 2:30 PM

Share

History of Telangana public sector companies: వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వున్న పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను మొదలయ్యాయి. అయిదు దశాబ్దాల క్రితం హోరెత్తిన నినాదం ‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’’ మరోసారి మారుమోగుతోంది. కార్మిక సంఘాలు గత నెలన్నరగా రిలే నిరాహార దీక్షలతోపాటు రాస్తారోకోలు, ఘెరావ్‌లు, ధర్నాలతో ఉద్యమిస్తున్నారు. ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలకు సంఘీభావం ప్రకటించాయి. కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తోంటే.. మరికొన్ని సంఘీభావం ప్రకటించి మిన్నకుండిపోయాయి. అడపాదడపా ప్రకటనలకు పరిమితమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆందోళనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మద్దతు లభించింది. కారణాలేవైతేనేం.. తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కే.తారక రామారావు విశాఖ ఉక్కు కోసం ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలకు మద్దతు ప్రకటించారు. పైగా గతంలో తాము దుమ్మెత్తిపోసిన ఆంధ్ర ప్రాంతం నుంచే రేపు తెలంగాణకు సాయం అవసరం వుంటుందని ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడి నుంచి మద్దతు రావడంతో విశాఖ ఉక్కు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఏకంగా ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసేశారు. ఇదంతా బాగానే వున్నా.. అసలు తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి? ఇదిపుడు తెలంగాణ యువత తెరమీదికి తెస్తున్న పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలోనే టీవీ9 కొంత అధ్యయనం చేస్తే తెలంగాణలో మూతపడ్డ కర్మాగారాలు, ఫ్యాక్టరీల విషయంలో ఆసక్తికరమైన గణాంకాలు తెరమీదికి వచ్చాయి.

తెలంగాణలో మూతపడిన లేదా ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించిన ఫ్యాక్టరీల గురించి ఆరా తీస్తే.. ముందుగా గుర్తుకొచ్చేది నిజాం షుగర్స్. 1937లో ఆనాటి నిజాం ప్రభువుల దూరదృష్టితో ఏర్పాటై.. 2002 దాకా ప్రభుత్వ రంగంలో నిడిచాయి నిజాం షుగర్స్‌కు చెందిన మూడు ఫ్యాక్టరీలు. నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని శక్కర్ నగర్‌‌పాటు మెట్‌పల్లి సమీపంలోని ముత్యంపేట, మెదక్ సమీపంలోని ముంభోజీపల్లిలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలో 2002 దాకా ప్రభుత్వ రంగంలో నడిచాయి. 2002లో టీడీపీ హయాంలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ బోధన్‌తో పాటు, ముత్యంపేట (జగిత్యాల), మంబోజిపల్లి (మెదక్‌) యూనిట్లను ప్రైవేటీకరించారు. అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆనాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్కరణల పంథాను తప్పుపట్టారు. ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న ప్రాంతాల్లో పర్యటించి.. తాము అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిజాం షుగర్స్‌ను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా వున్నా ఆ ఊసే ఎత్తలేదు.

నిజాం షుగర్స్‌‌ను ప్రైవేటీకరణ చేస్తున్న సమయంలో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తామన్న ఒప్పందంతో వేల కోట్ల ఆస్తులను కొట్టగొట్టేసిన దక్కన్ షుగర్స్.. ఆ తర్వాత ఫ్యాక్టరీలను ఖాయిలా పడేలా చేసింది. మెల్లగా నష్టాల పేరిట ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ నిలిపి వేశారు. చివరికి 2015 డిసెంబర్ 23వ తేదీన ఎన్.డీ.ఎస్.ఎల్. మూడు ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసేసింది. అప్పటికి టీఆర్ఎస్ అధికార బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర. తమ హయాంలోనే నిజాం షుగర్స్ మూతపడినా దానిపై కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఒక్క ప్రకటన చేయలేదు. వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీన పరచుకునే ప్రయత్నాలను కూడా చేయలేదు. బోధన్‌లోని ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు వంద ఎకరాల స్థలం, మెదక్‌లో 156 ఎకరాలు, మెట్‌పల్లిలో 90 ఎకరాల భూములు వున్నాయి. అవి కూడా ప్రధాన రహదారులకు పక్కనే వుండడంతో ఆ భూములకు విపరీతమైన డిమాండ్ వుంది. వీటి ఆస్తుల విలువ 500 కోట్ల రూపాయలకు పైగానే వుంటుందని అంఛనా.

ఇక తెలంగాణలో మూతపడిన మరో పెద్ద కంపెనీ ఆల్విన్. 1942లో అప్పటి నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపనీ సహకారంతో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్‌ ప్రారంభమైంది. 1952లో భారతదేశ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసి అందించిన ఘనత హైదరాబాద్ ఆల్విన్‌దే. 1963లో ఏపీఎస్‌ఆర్టీసీకి డెబుల్ డెక్కర్ బస్సును తయారు చేసింది కూడా అల్విన్‌ కంపెనీయే. ఆల్విన్‌ను ప్రభుత్వ రంగ పరిశ్రమగా ప్రకటించింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 1981లో జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 1983లో నిసాన్ సమన్వయంతో రిప్రిజిరేటర్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది అల్విన్‌ కంపెనీ. అలాగే పలు రకాల వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. సుమారు 48 ఏళ్లపాటు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్పత్తి రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. 1990 నుంచి కంపెనీలో ఆందోళనలు మొదలయ్యాయి. వీటి వెనుక ట్రేడ్ యూనియన్ రాజకీయాలతోపాటు.. రాష్ట్ర రాజకీయ నేతల ప్రమోయం వుందని అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో 1994వ సంవత్సరంలో అల్విన్‌ సంస్ధ మూతపడింది. ఇంత ప్రతిష్టాత్మక సంస్థను తిరిగి తెరిపించే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు.

డీబీఆర్‌ మిల్స్.. తెలంగాణకు చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ ఇది. 1922లో ఉత్పత్తిని మొదలు పెట్టింది డీబీఆర్‌ మిల్స్. హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత విలువైన భూముల్లో వుందీ ఫ్యాక్టరీ. 1984 వరకు ఇది బ్రహ్మాండంగా పని చేయగా.. దీనిని 1984లో లీజుకు తీసుకున్నారు సాగి కృష్ణంరాజు. 1991 వరకు ఫ్యాక్టరీని నడిపినట్లు రికార్డులున్నాయి. 1992 ఫిబ్రవరిలో ఓ అర్ధరాత్రి సడన్‌గా ఫ్యాక్టరీకి తాళం వేశారు సాగి కృష్ణంరాజు. రూ.100 కోట్ల విలువైన మిషనరీని రాత్రి పూట తరలించుకు పోయారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్‌ మిల్స్ భూమి విలువ ప్రస్తుతం దాదాపు రూ.600 కోట్లు.

ఐడీపీఎల్‌…. మరో ప్రతిష్టాత్మక సంస్థ. హైదరాబాద్ బాలానగర్‌లో 1961లో అనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైంది. 1967లో 891 ఎకరాల స్థలంలో హైదరాబాద్ బాలానగర్‌లో యూనిట్ ప్రారంభమైంది. 47 రకాల ఔషధాలను ఇక్కడ తయారు చేసే వారు. 1996 నుంచి బల్క్‌డ్రగ్‌, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ నిలిపి వేశారు. తెలంగాణలో గతంలో వుండిన మరో పెద్ద సంస్థ ప్రాగా టూల్స్. 1943 మే నెలలో సికింద్రాబాదులోని కవాడీగూడ ప్రాంతంలో ప్రాగా టూల్స్ కార్పోరేషన్ లిమిటెడ్‌గా ప్రారంభమైంది. పరిశ్రమలకు సంబంధించిన యాంత్రిక పరికరాలను తయారు చేసేందుకు ప్రాగా టూల్స్ ఏర్పాటైంది. 1963లో ఈ పరిశ్రమ పేరును ప్రాగాటూల్స్ లిమిటెడ్‌గా మార్చారు. రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. 1986లో ప్రాగా టూల్స్‌ను హెచ్.ఎం.టి సంస్థలో విలీనం చేశారు. 2015 సెప్టెంబర్ నెలలో ప్రాగా టూల్స్‌ను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ALSO READ: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్ర ఆసక్తికరం.. రాజకీయాలు తక్కువైనా అదే ఉత్కంఠ

Follow Us