Andhra: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?
Andhra Pradesh News: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టుపల్లి గ్రామంలో స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారం రోజుల్లో స్మశాన స్థలం కేటాయించకపోతే ఇకపై మృతదేహాలను కార్యాలయం ఎదుటే వదిలేస్తామని అధికారులకు అల్టిమేటం ఇచ్చారు.

స్మశాన వాటిక కోసం స్థలం ఇస్తారా? లేక శవాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లాలా..? అంటూ గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసన అధికారులను పరుగులు పెట్టించింది. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టు పల్లి గ్రామస్తులు గత కొన్నేళ్లుగా చనిపోయిన వారిని ఖననం చేసేందుకు స్మశానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా.. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. స్మశాన వాటికి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చిర్రెత్తిన గ్రామస్తులు.. స్మశాన వాటిక కోసం వినూత్నంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏకంగా డెడ్ బాడీతో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. స్మశాన వాటిక కోసం స్థలం ఇస్తారా..? లేక డెడ్ బాడీని ఇక్కడే వదిలేసి వెళ్లాలా..? అంటూ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు.
సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ చాంబర్ ముందు డెడ్ బాడీ ఉంచి.. గ్రామస్తులు అక్కడే భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కోనతట్టు పల్లి గ్రామంలో స్మశానం లేకపోవడం వల్ల చనిపోయిన వారిని ఎక్కడ ఖననం/దహనం చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి స్మశాన వాటిక స్థలం కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డెడ్ బాడీని ఖననం చేయకుండా.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో.. అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామానికి స్మశాన వాటిక స్థలం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో… మృతదేహాన్ని అక్కడ నుంచి గ్రామస్తులు తీసుకుని వెళ్లారు. వారం రోజుల్లో స్మశాన వాటిక సమస్య పరిష్కారం కాకపోతే.. ఈసారి ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని కార్యాలయం ఎదుట వదిలేసి వెళ్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
