AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ తొలి విడత ప్రచారానికి తెర

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నేటితో తెరపడింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 71 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 28న పోలింగ్ జరుగనుంది.

బీహార్ తొలి విడత ప్రచారానికి తెర
Balaraju Goud
|

Updated on: Oct 26, 2020 | 8:06 PM

Share

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నేటితో తెరపడింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 71 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 28న పోలింగ్ జరుగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌-లెఫ్ట్‌ పార్టీల కూటమి మధ్య వాడీ వేడిగా ప్రచారం సాగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్‌ రాజకీయాలు హోరెత్తాయి. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మూడు చోట్ల నిర్వహించిన ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఓట్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా తొలి విడత ప్రచారం సాగింది. ఎన్డీయే కూటమికి ఓటు వేసి నితీశ్ కుమార్‌కు మరోసారి అధికారం అప్పగించాలని ప్రధాని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా తమ కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్‌-లెఫ్ట్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

తొలి విడతలో 71 స్థానాలకు బుధవారం ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 114 మంది మహిళలే. నక్సల్‌ ప్రభావిత జిల్లాలైన గయా, రోహ్తాస్‌, ఔరంగాబాద్‌తో పాటు మొత్తం ఆరు జిల్లాల పరిధిలో తొలి దశ పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలు నితీశ్‌ కుమార్‌ కేబినెట్‌లో ఆరుగురు మంత్రుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 71 స్థానాల్లో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ నుంచి 42 మందిని బరిలో నిలవగా.. జేడీయూ నుంచి 41, బీజేపీ 29, కాంగ్రెస్‌ 21, ఎల్జేపీ నుంచి 41మంది చొప్పున అభ్యర్థులను పోటీలో నిలిపాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. అంతేకాదు, అగ్ర నాయకత్వాన్ని ఎన్నికల ప్రాచారానికి దింపింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, తలక్‌ సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలను ఓటర్లకు వివరించారు. తద్వారా ఓటర్లను ఎన్డీయే కూటమి వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, బీహార్ రాష్ట్ర ప్రగతి కుంటుపడకుండా ఉండాలంటే తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నితీశ్ కుమార్‌ కోరారు. వర్చువల్‌ ర్యాలీల్లోనే కాకుండా అనేక బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రెండు సభల్లో నితీష్ పాల్గొన్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ పలు ర్యాలీల్లో పాల్గొనగా.. మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి బీహారీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

మరోవైపు, ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ కూడా ముమ్మర ప్రచారం సాగించారు. ర్యాలీలతో పాటు సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ పంపిస్తూ, మీడియా సమావేశాలతో జనంలోకి దూసుకెళ్లారు. మరోవైపు, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి అందరినీ ఆశ్చర్యపరిచిన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తనదైన శైలిలో ప్రచారం కొనసాగించారు. తన తండ్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ పలు నియోజకవర్గాల్లో చురుగ్గానే తిరుగుతూ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ తరపున స్టార్ క్యాంపెయినింగ్ జాబితాను ముందుగా ప్రకటించి స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహనికి ప్రయత్నించింది కాంగ్రెస్ అధిష్టానం. సినీ నటులు రాజ్‌బబ్బర్‌, శత్రుఘ్నసిన్హా, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీపీఐ నేత కన్నయ్య కుమార్‌ ప్రధానంగా వామపక్ష పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

ఇక, ఈ నెల 28న జరుగనున్న తొలి విడత పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలతో బందోబస్తు కల్పిస్తున్నారు.

Follow Us