దసరా పండుగ వచ్చిందంటే కోల్కతా మహానగరం దుర్గాదేవి శోభతో వెలిగిపోతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా అక్టోబర్ 3 నుంచి కోల్కతాలో దుర్గాపూజ ఉత్సవాలు మొదలయ్యాయి. సిటీలో అన్ని చోట్లా దుర్గాదేవి మండపాలు వెలిశాయి. భారీ ఎత్తున భక్తులందరూ అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాక ఆ తరుణంలో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి.
దక్షిణాది రాష్ట్రాల మాదిరిగానే ఈ నగరంలో ఏర్పాటు చేసే దేవీమాత మండపాలు అత్యద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా వాటిని రూపొందిస్తారు. దుర్గా ఫెస్టివల్ సందర్భంగా భారతదేశం నలుమూలల్లో నుంచి అనేక మంది టూరిస్టులు ఈ మండపాలను చూడడానికి తరలివస్తుంటారు. ఇక వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన 5 మండపాల గురించి ఇప్పుడు చూద్దాం..
బాగ్బజార్: ఉత్తర కోల్కతాలో ఉన్న ఈ బాగ్బజార్.. నగరంలోని పురాతన దుర్గా పూజ మండపంగా పేరుగాంచింది. గత సంవత్సరం ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు అత్యద్భుతంగా జరిగాయి. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఈ మండపంలోని దుర్గాదేవి విగ్రహం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక ఈ మండపానికి ఆనుకుని ఉన్న గ్రౌండ్లో వివిధ రకాల ట్రెడిషనల్ స్టాల్స్, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.
కాలేజ్ స్క్వేర్: 1948 నుండి కాలేజ్ స్క్వేర్ దుర్గా పూజను విశిష్టమైన విగ్రహంతో జరుపుకుంటోంది. దుర్గామాత విగ్రహం ఎంతో అందంగా ఉండడమే కాకుండా ఇక్కడ ఇతర కళాత్మక ఖండాలు నగరవైభవానికి అద్దం పెట్టేలా ఉంటాయి. ఇక దీని పక్కన ఉన్న సరస్సు.. ఈ మండపానికి మరింత కళను అద్దుతుంది. అద్భుతమైన థీమ్ లైటింగ్, నీటిపై విగ్రహ ప్రతిబింబం చూడటానికి ప్రజలు ఈ మండపం వద్దకు తండోపతండాలుగా చేరుకుంటారు.
మొహమ్మద్ అలీ పార్క్: సెంట్రల్ కోల్కతాలో ఉన్న మరో ప్రసిద్ధిగాంచిన దుర్గాదేవి మండపం ఈ ప్రదేశంలో ఉంది. ఇప్పటికే 2018లో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది. ఇకపోతే గత సంవత్సరం దుర్గా విగ్రహాన్ని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన ‘పద్మవాత్ చిత్రానికి ప్రేరణతో రూపొందించారు.