చైనా ఆక్రమణలపై నేడు పార్లమెంట్ లో ప్రభుత్వ ప్రకటన
లడాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాట్లపై ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రకటన చేయనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు లోక్ సభలో..
లడాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాట్లపై ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రకటన చేయనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు లోక్ సభలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. భారత-చైనా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలపై చట్ట సభలో సర్కార్ తప్పనిసరిగా ప్రకటన చేయాలని, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పైగా ఈ నెల 13 న జరిగిన పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా పలువురు సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఈ అంశంపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్న ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూసేందుకు స్వయంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్..వుయ్ ఆర్ రెడీ అన్నట్టు సంసిధ్ధులయ్యారు.
ఇవాల్టి లోక్ సభ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. ఇప్పటికీ పాంగంగ్ సరస్సు వద్ద చైనా దళాలు మోహరించే ఉన్నాయి. పైగా రోజురోజుకీ తమ బలగాలను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ చేయనున్న ప్రకటన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.