AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్స్‌లో రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ రంగం సిద్ధం..!

కరోనా వైరస్​ను ఎదుర్కొనే క్రమంలో... టీకాను తయారు చేసే దిశగా... భారత్​ బయోటెక్​ అడుగులు పడుతున్నాయి. కొవాగ్జిన్​ తొలి విడత క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశలో ఉండగా… రెండో దశ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

నిమ్స్‌లో రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ రంగం సిద్ధం..!
Balaraju Goud
|

Updated on: Aug 20, 2020 | 2:38 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడుతామోనన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. అన్ని దేశాల సెంటిస్టులు కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనే క్రమంలో… టీకాను తయారు చేసే దిశగా… భారత్​ బయోటెక్​ అడుగులు పడుతున్నాయి. కొవాగ్జిన్​ తొలి విడత క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశలో ఉండగా… రెండో దశ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు రెండో వారంలో ఇవి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిమ్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో రెండో దశ క్లినకల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి విడత పరీక్షల్లో 50 మంది వాలంటీర్లకు రెండు డోసుల వంతున టీకా అందించారు. తొలి డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత అందరికీ బూస్టర్‌ డోస్‌ అందించడం జరిగింది. ఇప్పటికే వాలంటీర్ల రక్త నమూనాలను సేకరించిన భారత్‌ బయోటిక్‌ ల్యాబ్‌తో పాటు పుణెలోని వైరాలజీ లేబొరేటరీ, ఐఎంఆర్‌కు పంపించారు. వీటి ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వ్యాక్సిన్ పొందిన 50 మంది ఆరోగ్య పరిస్థితిని దాదాపు ఆరు నెలల పాటు పరీక్షించనున్నారు.

రెండో దశలో భాగంగా నిమ్స్‌లో వంద మంది వలంటీర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చేనెల వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనున్నారు. ఇందుకుగాను… 18-65 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను వలంటీర్లుగా ఎంపిక చేస్తున్నారు. వారి నుంచి సేకరించిన రక్త నమూనాలను ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన దిల్లీలోని ప్రయోగశాలకు పంపిస్తారు. వాటి ఆధారంగా… ఎంపిక చేసిన వలంటీర్లకు టీకాలు వేస్తారు. ఆ తర్వాత మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టనుంది భారత్​ బయోటెక్​.

Follow Us