దేశవ్యాప్తంగా పెరగుతున్న కరోనా రికవరీ రేటుః కేంద్రం
దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 90.62 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ వెల్లడించారు.

దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 90.62 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత అయిదు వారాల నుంచి దేశంలో కరోనా వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య సగటున తగ్గుతున్నట్లు తెలిపారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 78 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన వివరించారు. లక్ష నుంచి 10 లక్షల రికవరీ చేరుకోవడానికి 57 రోజుల సమయం పట్టినట్లు భూషన్ వివరించారు. అయితే తాజాగా పది లక్షల రికవరీలు కేవలం 13 రోజుల్లో అందుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తందా పరిశీలిస్తే ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్ఘడ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 58 శాతం మరణాలు నమోదు అవుతున్నాయన్నారు. పండుగ వేళల్లో కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు ఆయన తెలిపారు.
ఆర్థికంగా, జీడీపీలో బలంగా ఉన్న దేశాలు, ఆరోగ్యపరంగా ఉన్న దేశాల్లోనూ రెండవ దఫా కరోనా కేసులు విజృంభిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే, భారత్ లో మాత్రం రెండో దఫా కేసుల పెరుగుదల లేదన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాల్సిందేనన్న వీకే.పాల్.. ఎక్కువ సంఖ్యలో గుమ్మిగూడడమే కాకుండా, మనిషికీ మనిషి దూరం లేకున్నా .. సూపర్ స్ప్రెడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త వైరస్ కవాసకి వ్యాధిపై ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ స్పందించారు. కవాసకి వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని, అయిదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు ఆ వ్యాధి సోకుతుందన్నారు. అయితే ప్రస్తుతం ఇండియాలో ఆ కేసులు తక్కువే అని బలరాం భార్గవ్ తెలిపారు. భారత్లో కొవిడ్తో పాటు కవాసాకి రోగులు ఉన్నట్లు ఆనవాళ్లు లేవన్నారు. అలాంటి కేసులు చాలా అరుదైనవన్నారు. ఇండియాలో 17 ఏళ్లలోపు వారిలో 8 శాతం మంది మాత్రమే కొవిడ్ పాజిటివ్ ఉన్నారని, ఇక అయిదేళ్లలోపు ఆ సంఖ్య మరీ తక్కువగా ఉంటుందన్నారు బలరాం భార్గవ్.




