పర్యాటక రంగంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు..
పర్యాటక కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్, ఫెసిలిటేషన్ పేరిట పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మార్గదర్శకాలు జారీ చేశారు.

Tourism Activites In AP: పర్యాటక కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్, ఫెసిలిటేషన్ పేరిట పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మార్గదర్శకాలు జారీ చేశారు. టూరిజం ఆపరేటర్ల రిజిస్ట్రేషన్ కోసం యంత్రాంగం లేకపోవటంతో గణాంకాల నమోదుకు వీలుకావడం లేదని.. నిర్దిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించి వివిధ గణాంకాల నమోదు, వివరాలు, సమాచార సేకరణకు ఈ-రిజిస్ట్రేషన్లు అవసరం అవుతాయని జగన్ సర్కార్ స్పష్టం చేసింది.
గోవా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులకు అందించే సేవల్లో ప్రమాణాలు పెంచటంతో పాటు అత్యుత్తమ పర్యాటక సేవలు అందించేలా చర్యలు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మార్కెటింగ్ వ్యవస్థకు రూపకల్పన చేయాలని.. అలాగే ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పేలా కార్యాచరణ చేపట్టాలని సూచనలు చేసింది.
ఏపీలో సుదీర్ఘమైన తీరప్రాంతంతో పాటు నదులు, సుందరమైన ఇతర నీటి వనరులు, హిల్ స్టేషన్లు , అటవీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, బౌద్ధారామాలు, ఉన్నందున ఈ పర్యాటక సేవల్ని వ్యవస్థీకరించేలా కార్యాచరణ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పర్యాటక కార్యకలాపాల్లో ఉన్న సర్వీసు ప్రొవైడర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు, సబ్సీడీలకు అర్హులవుతారని వెల్లడించింది. కాగా, ఈ ఆదేశాలు, మార్గదర్శకాలు రాష్ట్రంలో తక్షణం అమల్లోకి వస్తాయని పర్యాటక శాఖ పేర్కొంది.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు..




