Hyderabad: అబ్బ.! ‘అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా’
నూతన సంవత్సరం వేళ అక్రమ మద్యం రవాణాపై ట్రాఫిక్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ముందుగానే తగిన చర్యలు చేపట్టింది. మరి ఇటీవల ఏం జరిగిందో.. ఓ సారి ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

నూతన సంవత్సరం వేళ అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఎన్డీపీఎల్(నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) అక్రమ రవాణాను అడ్డుకునే దిశగా ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. పహాడ్ షరీఫ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవా, అహ్మదాబాద్, రాజ్కోట్ వంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరలకే ఎన్డీపీఎల్ మద్యం హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్, ఎస్టిఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని విమానాలు, బస్సులు, కార్ల ద్వారా మద్యం తీసుకొస్తున్న సమయంలో పహాడ్ షరీఫ్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో మొత్తం 91 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం బాటిళ్లు గోవా, అహ్మదాబాద్, రాజ్కోట్ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించినవని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగించే ఈ ఎన్డీపీఎల్ మద్యం విక్రయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో ఎక్సైజ్, ఎస్టిఎఫ్కు చెందిన నాలుగు బృందాలతో పాటు.. సరూర్నగర్ ఎస్హెచ్ఓ, సరూర్నగర్ డిడిఎఫ్, రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏసీ, మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పరిధిలోని సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. పటిష్టమైన సమన్వయంతో చేపట్టిన ఈ దాడులు విజయవంతమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అక్రమ మద్యం రవాణాకు పాల్పడేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. ఎన్డీపీఎల్ మద్యం తరలింపు, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని.. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
