AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Ranker: పట్టణం నుండి పల్లె బాటపట్టిన విద్య కుసుమం.. టాప్ ర్యాంకర్ గా నిలిచిన విద్యార్థి

నాణ్యమైన విద్య కోసం అనేక రకాల కసరత్తు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో మరీ చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలని కలలు కంటారు. అయితే విజయనగరం జిల్లాలో గంప ఈశ్వర్ కార్తీక్ అనే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించి తమ కుమారుడిని టాప్ ర్యాంకర్‌గా నిలిచేలా చేశారు.

Top Ranker: పట్టణం నుండి పల్లె బాటపట్టిన విద్య కుసుమం.. టాప్ ర్యాంకర్ గా నిలిచిన విద్యార్థి
District Ssc Toper Eswar Karthik
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 26, 2024 | 11:10 AM

Share

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తుంటారు. నాణ్యమైన విద్య కోసం అనేక రకాల కసరత్తు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో మరీ చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలని కలలు కంటారు. అయితే విజయనగరం జిల్లాలో గంప ఈశ్వర్ కార్తీక్ అనే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించి తమ కుమారుడిని టాప్ ర్యాంకర్‌గా నిలిచేలా చేశారు.

విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేట రింగ్ రోడ్ వద్ద నివాసం ఉంటున్న గంప గౌరీ శంకరరావు, శిరీష లకు ఇద్దరు కుమారులు. ఈ దంపతులు తమ చిన్న కుమారుడు ఈశ్వర్ కార్తీక్ ను మాత్రం నగరంలో కార్పోరేట్ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ నగరానికి దూరంగా ఉన్న ఒక పల్లెటూరులోని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. కార్పోరేట్ స్కూల్స్‌లో చదివించుకునే ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కార్పోరేట్ సంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని నిర్ణయించుకున్నారు.

అందుకోసం నెల్లిమర్ల మండలం సతివాడ ఏపి మోడల్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుని, ఆరవ తరగతిలోనే ఈశ్వర్ కార్తీక్ ను అక్కడ చేర్పించారు. అలా ఆరో తరగతి నుండి సతివాడ ఏపీ మోడల్ స్కూల్ లో చదువుతున్న ఈశ్వర్ కార్తీక్ మొదటి నుండి విద్యలో చురుకుగా ఉండేవాడు. అంతే కాకుండా స్కూల్లోని టీచర్స్ పట్ల కూడా ఎంతో వినయంగా వ్యవహరించేవాడు. అయితే ఏపీ మోడల్ స్కూల్ లో విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడంతో విజయనగరం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల మేర సతివాడ స్కూల్ వరకు ప్రతిరోజు ఆటోలోనే వెళ్లి చదువును కొనసాగించాడు.

విజయనగరం ఇంటికి సమీపంలో కార్పోరేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ అక్కడ కాకుండా ఇరవై కిలోమీటర్లు ఆటోలో వెళ్లి చదువుకోవడం కార్తీక్ కి కొంత ఇబ్బందిగానే మారేది. అయినప్పటికీ ఏ రోజు స్కూల్ కి మాత్రం డుమ్మా కొట్టకుండా చదువు కొనసాగించి ఉత్తమ ఫలితాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ఆలోచనకు తగ్గట్టు ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కూడా నాణ్యమైన విద్యను అందించడంతో ఈశ్వర్ కార్తీక్ కు కలిసి వచ్చింది. దీంతో ఇటీవల వచ్చిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో టాప్ ర్యాంకర్ గా నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అత్యధిక మార్కులతో జిల్లాలోనే టాపర్ నిలవడంతో కార్పోరేట్ యాజమాన్యాలు సైతం విస్తుపోయాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో అనేక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మెరుగైన విద్య అందిస్తామని లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుంటూ విలువైన ప్రకటనలు సైతం గుప్పించారు. అయితే ఇవేమీ పరిగణలోకి తీసుకొని ఈశ్వర్ కార్తీక్ తల్లిదండ్రులు మాత్రం ఏపీ మోడల్ స్కూల్ లో చదివించడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ఆనందపడుతున్నారు.

సహజంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం పల్లెటూర్ల నుండి పట్టణానికి వచ్చి లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తుంటే, ఈశ్వర్ కార్తీక్ మాత్రం పట్టణం నుండి పల్లెటూరు కెళ్లి అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలవడం అందరినీ ఆలోచింప చేస్తుంది. ఈశ్వర్ కార్తీక్ వంటి ఎందరో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తమ ప్రతిభను చాటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన విద్య అందుతుందన్న విశ్వాసాన్ని పెంచారని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…