Coronavirus: కరోనా దెబ్బతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పెరిగిన ఫిట్‌నెస్ శ్రద్ధ

కరోనా మహమ్మారి భయం ప్రజలకు ఆహారం విషయంలో ఆరోగ్యకరమైన విధానాలు నేర్పింది. భారతీయులు తమ ఆహారంలో ప్రోటీన్, విటమిన్ల మొత్తాన్ని పెంచారు.

Coronavirus: కరోనా దెబ్బతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పెరిగిన ఫిట్‌నెస్ శ్రద్ధ
Corona Pandemic Food Habits
Follow us

|

Updated on: Sep 05, 2021 | 9:34 AM

Coronavirus: చావుకు పెడితేనే కానీ లగ్గానికి కుదరదని ఓ పాత సామెత. దానిని నిజం చేసింది కరోనా. ఆహారపు అలవాట్ల విషయంలో మంచిని వదిలేసి.. ఇష్టం వచ్చినట్టు ఉంటున్న ప్రజలకు కరోనా దెబ్బతో ఆరోగ్యం పై బెంగ పట్టుకుంది. దీంతో వారి జీవనశైలిలో చాలా ఆరోగ్యకరమైన మార్పులు వచ్చాయి. కరోనా మహమ్మారి భయం ప్రజలకు ఆహారం విషయంలో ఆరోగ్యకరమైన విధానాలు నేర్పింది. భారతీయులు తమ ఆహారంలో ప్రోటీన్, విటమిన్ల మొత్తాన్ని పెంచారు. ఫాస్ట్ ఫుడ్, మైదాతో తయారు చేసిన వాటికి దూరంగా ఉన్నారు. మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ ఇండియా కన్స్యూమర్ ఇటీవల చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా అంటువ్యాధిలో ప్రజల జీవనశైలిలో ఎంత మార్పు వచ్చిందో తెలుసుకుందాం.

భారతీయులలో కనిపించిన మూడు పెద్ద మార్పులు

ఆహారం: భారతీయుల ప్లేట్‌లో ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం పెరిగింది

పరిశోధన ప్రకారం, 52 శాతం మంది ప్రజలు తమ ప్లేట్‌లో క్రమం తప్పకుండా బ్రౌన్ రైస్, ఆర్గానిక్ పండ్లను ఉండేలా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, కరోనాకి ముందు, వారు అప్పుడప్పుడు మాత్రమే అలాంటి వాటిని తినేవారని 50 శాతం మంది చెప్పారు. 55 శాతం మంది భారతీయులు తమ ఆహారాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంపై దృష్టి సారించారు.

ఫిట్‌నెస్: 57% జాగింగ్, సైక్లింగ్ ప్రారంభించారు..

కరోనా కాలంలో, ప్రజలు శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇచ్చారు. పరిశోధనలో, 51 శాతం మంది భారతీయులు 2019 తో పోలిస్తే 2020 లో వారంలో మూడు రోజులు బ్రిస్క్ వాకింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం ప్రారంభించారని చెప్పారు. అదే సమయంలో, 57 శాతం మంది ప్రజలు జాగింగ్, సైక్లింగ్ చేస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం: మెరుగైన నిద్ర, ఒత్తిడి తగ్గడం,

పరిశోధన ప్రకారం, 2020 నుండి ప్రజలు వారి జీవనశైలిలో చేసిన మార్పులు వారి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ధ్యానం చేసే ప్రతి 20 మందిలో 9 మంది మునుపటి కంటే బాగా నిద్రపోతున్నారు. టెన్షన్ కూడా తగ్గింది. మరింత శక్తివంతమైన అనుభూతిని పొందుతున్నారు.

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మహిళలు మరింత చురుకుగా..

మింటెల్ ఇండియా కన్స్యూమర్ కంటెంట్ హెడ్ నిధి సిన్హా మాట్లాడుతూ, ఈ మహమ్మారి ప్రజలను ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించేలా పనిచేసిందని చెప్పారు. భారతీయులు వారి శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, ఆహారం, శారీరక శ్రమపై కూడా దృష్టి పెడుతున్నారు. భారతీయుల జీవనశైలిలో మార్పును పరిశీలిస్తే, అనేక కంపెనీలు ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలను కూడా అందిస్తున్నాయి.

వ్యాధులు, రోగనిరోధక శక్తితో పోరాడే సామర్థ్యాన్ని పెంచడంలో మహిళలు ముందున్నారని పరిశోధన చెబుతోంది. వారి రోగనిరోధక శక్తిని గురించి జాగ్రత్త పడే వారిలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. 48 శాతం మంది భారతీయులు ఆరోగ్యంగా ఉండటానికి ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల నుండి ప్రేరణ పొందుతున్నారు.

Latest Articles