మీరు చేసే ఈ చిన్న తప్పులు మీ దంతాలకు శాపంగా మారుతున్నాయని తెలుసా?
దంతాల మీద ఉండే తెల్లటి పొర ఎనామెల్ మన పళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో భారతీయులలో ఈ పొర వేగంగా క్షీణిస్తోందని దంత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా, మనం నిత్యం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా పళ్ళు బలహీనంగా మారుతున్నాయని, తద్వారా తీవ్రమైన సెన్సిటివిటీ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

దంతాల ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బ్రష్ చేయడం. కానీ బ్రష్ చేసే విధానం మరియు మనం తీసుకునే ఆహారం దంతాల దృఢత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పళ్ళు తెల్లగా మెరవాలన్న ఆరాటంలో చేసే కొన్ని పనులు పళ్ళ ఆయుష్షును తగ్గిస్తున్నాయి. దంతాలను గట్టిగా రుద్దడం, సోషల్ మీడియాలో చూసి చేసే ప్రయోగాలు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దేశంలోని 27 శాతం మంది రోగులలో ఎనామెల్ అరిగిపోయినట్లు గుర్తించిన వైద్యులు, దీనిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవనశైలి మార్పుల గురించి వివరిస్తున్నారు.
దైనందిన అలవాట్లు
చాలామంది పళ్ళు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో దంతాలను చాలా వేగంగా, గట్టిగా రుద్దుతుంటారు. ముఖ్యంగా గట్టి బ్రిజిల్స్ ఉన్న బ్రష్లను వాడటం వల్ల పళ్ళపై ఉండే సహజమైన ఎనామెల్ పొర క్రమంగా అరిగిపోతుంది. దీనివల్ల పళ్ళు సెన్సిటివిటీకి గురై, చల్లని లేదా వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. మరోవైపు నేటి ఆధునిక ఆహారపు అలవాట్లు కూడా దంతాలకు ముప్పుగా మారాయి.
కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, టీ మరియు సిట్రస్ పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలోని ఆమ్లాలు ఎనామెల్ను మెత్తబరుస్తాయి. అలాగే శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గి, నోటిలోని ఆమ్లాలు దంతాలను మరింతగా దెబ్బతీస్తాయి. లాలాజలం అనేది దంతాలకు సహజమైన రక్షణను అందిస్తుంది, కాబట్టి రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం.
కృత్రిమ పద్ధతులు
తెల్లని చిరునవ్వు కోసం సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన నిమ్మరసం, బేకింగ్ సోడా లేదా బొగ్గు వంటి ఇంటి చిట్కాలను పాటించడం దంతాల పాలిట శాపంగా మారుతోంది. ఇవి తాత్కాలికంగా పళ్ళను తెల్లగా చేసినప్పటికీ, వాటిలోని ఘాటైన పదార్థాలు ఎనామెల్ను శాశ్వతంగా తొలగిస్తాయి. ఒక్కసారి ఎనామెల్ పొర పోతే అది మళ్ళీ తిరిగి రాదు. అందుకే సాధారణ టూత్పేస్టుల కంటే దంతాల ఎనామెల్ను రక్షించే ప్రత్యేకమైన పేస్టులను వాడటం మంచిది.
ఇవి దంతాలను దృఢపరచడమే కాకుండా ఆమ్లాల దాడి నుండి రక్షిస్తాయి. ఆమ్ల రసాలు తాగినప్పుడు వెంటనే నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం లేదా స్ట్రా వాడటం వల్ల దంతాలతో వాటి స్పర్శను తగ్గించవచ్చు. దంతవైద్యుల సలహాతో సరైన పద్ధతులను పాటించడం వల్ల మాత్రమే మన చిరునవ్వుతో పాటు దంతాల ఆరోగ్యాన్ని పదికాలాల పాటు కాపాడుకోగలం.
