Raghubabu: ‘అప్పుడు డైరెక్టర్ వినాయక్ అని చెప్పగానే.. ఆయనెవరు అన్నా.?’
టాలీవుడ్ నటుడు రఘుబాబు ఆది సినిమా కోసం ఆడిషన్కు వెళ్లినప్పుడు.. ఆయనకు దర్శకుడు వి.వి. వినాయక్ గురించి తెలియదు. ఆ సినిమా అనుభవం, ముఖ్యంగా మొదటి షాట్ తర్వాత వినాయక్ గొప్పదనాన్ని గుర్తించారు. గంగిరెడ్డి పాత్ర ఆయన కెరీర్కు ఎలా కీలకమైందో, అప్పటి నుంచి ఎలా బిజీ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారో వివరించారు.

టాలీవుడ్ నటుడు రఘుబాబు తన సినీ కెరీర్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాకు సంబంధించిన కీలక అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్కు ఒక కీలక మలుపు అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్లోకి తాను ఎలా అడుగుపెట్టానో, దర్శకుడు వి.వి. వినాయక్తో తన తొలి అనుభవం ఎలా ఉందో వివరించారు. ఆ సమయంలో నలమలపు బుజ్జి ఆఫీసుకు రమ్మని పిలిచినప్పుడు.. రఘుబాబు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఏం వేషం ఉండి నన్ను పిలిచి, ఆఫీసులో క్యారెక్టర్ గురించి రెండు గంటలు చెప్పాల్సిన అవసరం ఏంటి? అని నిరాశతో అనుకున్నానని ఆయన తెలిపారు. ఆ సమయంలో ఆయనకు ఆది సినిమా గురించి, దాని దర్శకుడు వి.వి. వినాయక్ గురించి పెద్దగా తెలియదు. ఆయనెవరు అన్నా.? అని అడిగినప్పుడు, సాగర్ అసిస్టెంట్ అని చెప్పారని రఘుబాబు గుర్తుచేసుకున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగతా యూనిట్ సభ్యులంతా కొత్తవారేనని, వినాయక్కు కూడా అది మొదటి చిత్రమని ఆయనకు అప్పుడు తెలిసిందన్నారు.
ఆడిషన్ కోసం వెళ్ళినప్పుడు, దర్శకుడు వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేష్తో పాటు కథా చర్చలు జరుగుతున్నాయి. వినాయక్, రఘుబాబును చూడగానే లేచి నిలబడి ‘రఘుబాబు గారు రండి’ అని ఆహ్వానించారట. ఈ గౌరవానికి రఘుబాబు ఆశ్చర్యపోయారట. వినాయక్ తనకు గంగిరెడ్డి పాత్ర గురించి సుదీర్ఘంగా, దాదాపు ఒక గంట పాటు, సీన్ టూ సీన్ వివరించారు. “ఈ సినిమా తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి” అని వినాయక్ చెప్పినప్పుడు, నిరాశలో ఉన్న రఘుబాబు “ఏం కాదులేండి” అని మనసులో అనుకున్నారు. రెమ్యూనరేషన్, అడ్వాన్స్ విషయాల్లో కూడా పెద్దగా ఆసక్తి చూపించకుండా, 365 రోజులు ఖాళీగా ఉన్నాను, 35-40 రోజులు షూటింగ్కు ఏంటి? అని భావించారు. అయితే, విజయనగరంలో మొదలైన షూటింగ్లో మొదటి రోజు అనుభవం రఘుబాబు అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఒక డైలాగ్ చెప్పమని వినాయక్ అడిగినప్పుడు, సాధారణంగా చెప్పబోయిన రఘుబాబును అడ్డుకుని, గ్లిసరిన్ పూసుకో, కళ్ళు ఎర్రగా కనిపించాలి, లిప్ కదలాలి, ఐ బ్లింక్ కాకూడదు అని వినాయక్ వివరించారు. వినాయక్ చెప్పినట్లుగానే డైలాగ్ చెప్పిన తర్వాత, మానిటర్లో ఆ షాట్ను చూసిన రఘుబాబు, తనకే భయం వేసిందని, అప్పటివరకు తనను తాను గుర్తించలేకపోయానని అన్నారు. “అమ్మబాబోయ్, ఈయన ఏంటి!” అని వినాయక్ దర్శకత్వ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయానని రఘుబాబు వివరించారు.
ఆ రోజు నుంచి ఆది సినిమా షూటింగ్ మొత్తం వినాయక్కు ఒక పూనకంలా సాగిందని రఘుబాబు అన్నారు. కేవలం 72 రోల్స్తో సినిమాను పూర్తి చేశారని, ఆయన గొప్పతనం ఏమిటంటే, సినిమా ప్రారంభించిన రోజునే ఫస్ట్ కాపీని రీ-రికార్డింగ్తో సహా చూసే గొప్ప దర్శకుడని ప్రశంసించారు. ఆది విజయం తర్వాత, వినాయక్తో తన స్నేహం బలపడిందని, వినాయక్ తనను చాలా ఇష్టపడతారని రఘుబాబు పేర్కొన్నారు. వినాయక్తో తర్వాత మాటల్లో, తాను మొదట్లో ఆయనపై పెట్టుకున్న అభిప్రాయాలను నిజాయితీగా చెప్పగా, వినాయక్ దానిని స్వీకరించారని అన్నారు.
