Mahesh Babu: నాన్న పెద్దకర్మలో మహేష్‌ ఎమోషనల్‌.. అభిమానుల కంటతడి

కృష్ణ పెద్ద కర్మలో మహేష్‌ బాబు బాగా ఎమోషనల్‌ అయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం, అభిమానుల కోసం.. రెండు వేదికలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు..మహేష్‌ మాట్లాడుతుంటే అభిమానుల కంట నీళ్లు తిరిగాయి.

Mahesh Babu: నాన్న పెద్దకర్మలో మహేష్‌ ఎమోషనల్‌.. అభిమానుల కంటతడి
Gattamaneni Mahesh Babu - Krishna
Follow us

|

Updated on: Nov 28, 2022 | 7:54 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ దశ దిన కర్మ హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌తో పాటు.. జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అటు ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇటు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. భౌతికంగా ఈ లోకానికి దూరమైన తమ అభిమాన హీరో జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఇంట్లో వరుస విషాదాలతో మహేష్ పూర్తిగా కుంగిపోయారు. ఏడాది ప్రారంభంలోనే అన్నయ్యను.. రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవిని.. ఇప్పుడు తండ్రి కృష్ణను కోల్పోవడంతో మహేష్‏ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

ఆదివారం పెద్ద కర్మ నిర్వహించిన మహేష్‌ బాబు

ఈనెల 15న కన్నుమూసిన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మను..ఆదివారం ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో మహేష్ బాబు నిర్వహించారు. ముందుగా ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆ తరవాత మధ్యాహ్నం అతిథులకు విందు ఇచ్చారు. నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం.. అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లోనూ ఉంటారని మహేష్‌ ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సమయంలో అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.

అభిమానుల కోసం 32 రకాల వంటలు

పెద్ద కర్మకు వచ్చే అతిథుల కోసం..మహేష్‌ బాబు రెండు వేదికలను ఏర్పాటుచేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెషన్‌లో విందు రెడీ చేయించారు..అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్‌లో విందు ఇచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావించిన మహేష్.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాస్ సిస్టమ్ పెట్టారు. ఫ్యాన్స్‌కు పాస్‌లు ఇచ్చారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే జేఆర్సీ కన్వెన్షన్‌లోకి అనుమతించారు. అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు.

మరోవైపు, ఎన్ కన్వెన్షన్‌కు వెళ్లి అక్కడికి వచ్చిన ప్రముఖులను కూడా మహేష్ బాబు పలకరించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మహేష్ బాబు సరదాగా ముచ్చటిస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ బాబుతో పాటు దర్శకులు త్రివిక్రమ్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కూడా ఉన్నారు.

జేఆర్సీ కన్వెన్షన్‌లో భోజనం చేసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ అన్న తమ కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు అంటూ పొంగిపోతున్నారు. ఆయన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. ఇంటి వద్ద పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికాగానే మహేష్ బాబు.. అభిమానులను పలకరించేందుకు బాబాయ్ ఆదిశేషగిరిరావుతో కలిసి జేఆర్సీ కన్వెన్షన్‌కు వెళ్లారు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తన తండ్రి తనకు ఇచ్చిన గొప్ప ఆస్తి అభిమానులు అని.. ఈ విషయంలో తన తండ్రికి రుణపడి ఉంటానని మహేష్ బాబు అన్నారు. పెద్ద కర్మకు వచ్చినవారంతా భోజనం చేసి సురక్షితంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు.

ఈనెల 15 తెల్లవారుజామున కృష్ణ మృతి

సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తరవాత గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 15 తేదీ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను 16వ తేదీన జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉన్న మహేష్‌బాబు.. ఆదివారం తండ్రి దశదిన కర్మలో అభిమానులనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..