
ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గత రెండు రోజులుగా నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్కు తెరపడింది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవినే మరోసారి చైతూతో జోడీ కట్టనుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ చందుమొండేటి తెరకెక్కిస్తోన్న ‘NC 23 (వర్కింగ్ టైటిల్)లో సాయి పల్లవి హీరోయిన్గా ఎంపికైనట్లు దర్శక, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. గీతాఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమానకు స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా విరాట పర్వం తర్వాత మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు సాయిపల్లవి. అయితే నాగచైతన్య సినిమాతో మళ్లీ మనల్ని పలకరించేందుకు రెడీ అయ్యిందీ ట్యాలెంటెడ్ బ్యూటీ. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది సాయి పల్లవి. NC 23 సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. ‘ ఈ లవ్లీ టీమ్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నన్ను ఎంచుకున్నందుకు అల్లు అరవింద్, బన్నీవాసు, చందుమొండేటికి ధన్యవాదాలు. ఓ స్పెషల్ ఫిల్మ్లో అక్కినేని నాగచైతన్యతో మరోసారి జోడీ కట్టుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులను చాలా మిస్ అయ్యాను. NC 23 సినిమాతో మళ్లీ మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని ట్వీట్లో రాసుకొచ్చింది సాయి పల్లవి.
నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. గతంలో వీరి కాంబోలో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. ఇటీవలే కార్తికేయ 2 తో భారీ హిట్ కొట్టాడు చందమొండేటి. అలాగే చైతూ కూడా కస్టడీ సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడీ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2018 నవంబర్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు మత్స్యకారులు గుజరాత్ రాష్ట్ర తీరంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్థాన్ కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. సుమారు అక్కడే ఏడాదిన్నర పాటు జైలులో మగ్గారు. ఇప్పుడీ మత్య్సకారుల జీవితాలను ఆధారంగా చేసుకునే NC 23 తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసమే నాగచైతన్య, ,చందూ మొండేటి తదితరులు కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులను కలిశారు. వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, భాష, శైలి గురించి తెలుసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.