Chiranjeevi: ‘హీరోగా సినిమా తీస్తానని చెప్పి.. ఆ నిర్మాత చిరంజీవికి హ్యాండ్ ఇచ్చాడట..’

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో మంచి పాత్రల కోసం విలన్, గెస్ట్ రోల్స్ ఒప్పుకున్నారట. ఎవరినీ బాధపెట్టకూడదనే భావనతో నిర్మాతలు చెప్పింది విని, తన భయాన్ని అధిగమించి, కష్టపడి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Chiranjeevi: హీరోగా సినిమా తీస్తానని చెప్పి.. ఆ నిర్మాత చిరంజీవికి హ్యాండ్ ఇచ్చాడట..
Megastar Chiranjeevi

Updated on: Feb 01, 2026 | 12:07 PM

ప్రతి వ్యక్తిలోనూ అభద్రతాభావం, భవిష్యత్తు గురించి భయం ఉండటం సహజం. సినిమా సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులు కారు. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో ఉన్న హీరోలకు ఈ భావం మరింత ఎక్కువగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అయినప్పటికీ, ఇందులోని పోటీ, అనిశ్చితి నటుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌ను చాలా జాగ్రత్తతో ప్రారంభించారట. ఇండస్ట్రీలోని విషాద గాధల గురించి ఆయన చాలా విన్నారు. మద్రాసులోని పాండీ బజార్‌లో తగిన గుర్తింపు, సరైన అవకాశాలు దొరక్క నిరాశలో మునిగిన నటులు ఎక్కువగా ఉంటారని ఆయనకు తెలుసు. అంతేకాకుండా, మద్రాసు వెళ్లిన కొత్తల్లో సిగరెట్లు కాల్చడం, కిళ్లీ వేసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండేవారు. కెరీర్ తొలినాళ్ళలో పారితోషికం విషయంలో కూడా ఆయనకు పెద్దగా పట్టింపు ఉండేది కాదు. నిర్మాతలు ఒక మొత్తం ఇస్తానని చెప్పి, చివరకు రూ.2000 ఇచ్చి సర్దుకోమన్నా, మారు మాట్లాడకుండా తీసుకున్న సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయట.

ఒకరోజు సత్య చిత్ర సంస్థ నుంచి పిలుపు వచ్చింది. అడవిరాముడు లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పెద్ద సంస్థ కావడంతో, మంచి పాత్ర వస్తుందని ఆశతో వెళ్లారు. అక్కడ సంస్థ అధినేతలలో ఒకరైన సూర్యనారాయణ, హీరో కృష్ణతో కొత్త అల్లుడు అనే చిత్రంలో విలన్ పాత్ర చేయమని చెప్పారు. కైకాల సత్యనారాయణ ప్రధాన విలన్‌గా ఉన్నారని తెలిపారు. అప్పటికే చిరంజీవి ఆరని మంటలు, ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలలో హీరోగా నటిస్తున్నారు. అందుకే విలన్ పత్రాలు వేయడం లేదని చెప్పారట. కానీ సూర్యనారాయణ వదిలిపెట్టలేదు. “మీరు టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్, హిందీలో శత్రుఘ్నసిన్హా వంటివారు విలన్ పాత్రలు వేయడం లేదా? పైగా త్వరలోనే మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా చేయాలని మేము అనుకుంటున్నాము,” అంటూ నమ్మబలికి ఒప్పించారు. సత్య చిత్ర పెద్ద సంస్థ కావడంతో, రాఘవేంద్ర రావు వంటి దర్శకులతో వారికి పరిచయాలు ఉండటంతో, తాను నో అంటే వారికి చెడుగా చెబుతారేమోనని, అవకాశాలు పోతాయేమోనని చిరంజీవి ఆలోచించరు. త్వరలో హీరోగా సినిమా చేస్తారనే ఆశతో, విలన్ పాత్రకు అంగీకరించారట.

కొత్త అల్లుడు చిత్రం పూర్తయింది. ఆ తర్వాత మళ్లీ హీరో కృష్ణతో కొత్తపేట రౌడీ చిత్రాన్ని సత్యనారాయణ, సూర్యనారాయణ ప్రారంభించారు. అందులో గెస్ట్ పాత్ర చేయమని చిరంజీవిని అడిగారు. హీరోగా సినిమా చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు గెస్ట్ పాత్ర వేయమంటారేమిటని చిరంజీవి మనసులో అనుకున్నారట. కానీ సూర్యనారాయణను గట్టిగా ప్రశ్నించలేదట. సూర్యనారాయణ మళ్లీ కొత్తపేట రౌడీలో పాజిటివ్ రోల్ అని, ఒక పాట కూడా ఉంటుందని, ఇది చేయమని, ఆ తర్వాత ఆయన హీరోగా చేయబోయే చిత్రానికి కథ సిద్ధమైందని, వచ్చే ఏడాది క్వీన్ ఎలిజబెత్ సొంత షిప్ బొంబాయి వస్తుందని, దానిలో షూటింగ్ చేయాలని ఇలా కొత్త ఆశలు చూపించి గెస్ట్ రోల్ చేయించారట.

చిరంజీవి ఇలా విలన్, గెస్ట్ రోల్స్ చేయడం, ఆయనను హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్న ఇతర నిర్మాతల నుంచి విమర్శలు వచ్చాయి. “మిమ్మల్ని హీరోగా పెట్టి మేము సినిమాలు తీస్తుంటే, మీరేమో విలన్, గెస్ట్ రోల్స్ చేస్తున్నారు, ఇది మా సినిమాలకు దెబ్బ కదా” అని వారు అనేవారట. వారికి నచ్చజెప్పి చిరంజీవి కొత్తపేట రౌడీ చిత్రంలో నటించారట. అయితే, సూర్యనారాయణ చెప్పిన కబుర్లన్నీ అబద్ధమని ఆ సినిమా విడుదలయ్యాక తెలిసింది. ఆయన మోసానికి చిరంజీవి బాధపడ్డారు. ఆపై చిరంజీవి క్రమక్రమంగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. ఇప్పుడు టాలీవుడ్‌కు పెద్దన్నయ్యగా మారిన సంగతి మనకు తెలిసిందే. కాగా, ఈ వార్తను సీనియర్ జర్నలిస్టులు, ఇంటర్నెట్‌లో నుంచి పలు కథనాల ద్వారా సేకరించిన సమాచారం మాత్రమే.

ఇది చదవండి: 

అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..