AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

టాలీవుడ్ హీరోయిన్లలో తనదైన శైలి నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానటి సౌందర్య. ఆమె జీవితం ఒక విషాద కావ్యం. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండి.. కేవలం అభినయంతోనే రాణించవచ్చని నిరూపించిన ఆమె.. 1990లలో స్టార్ హీరోయిన్‌గా తెలుగుతో పాటు పలు భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. 2004లో విమాన ప్రమాదంలో ఆమె అకాల మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు.

Tollywood: అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు
Soundarya
Ravi Kiran
|

Updated on: Jan 31, 2026 | 1:54 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న మహానటి సౌందర్య.. సావిత్రి అంతటి నటిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. కేవలం అభినయంతోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగవచ్చునని, అందాల ఆరబోత అవసరం లేదని ఆమె తన కెరీర్ ద్వారా నిరూపించింది. ఎక్స్‌పోజింగ్ చేయననే ఆమె నిర్ణయాన్ని మొదట్లో కొందరు తేలికగా తీసిపారేసినా, దర్శకులు ఆమె అభిప్రాయాలను గౌరవించడంతో ఆమెకు అవకాశాలు మరింతగా పెరిగాయి. 1971 జూలై 18న సౌమ్య అనే పేరుతో జన్మించింది. సౌందర్య తల్లి మంజుల, తండ్రి సత్యనారాయణ. సత్యనారాయణ ఒక రచయిత, దర్శకుడు, నిర్మాత. తండ్రితో షూటింగ్ చూడడానికి వెళ్లిన సౌందర్యకు 1992లో విడుదలైన కన్నడ చిత్రం గంధర్వ ద్వారా నటిగా తొలి అవకాశం వచ్చింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో ఆమె చదువుకు స్వస్తి చెప్పింది. తెలుగులో హరీష్ సరసన నటించిన మనవరాలి పెళ్లి ఆమె తొలి చిత్రం. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

సౌందర్య కెరీర్ ప్రారంభంలో మనీషా ఫిలిమ్స్ చిత్రాలతో బాగా పేరు తెచ్చుకుంది. మనవరాలి పెళ్లి, రైతు భారతం, అమ్మోరు వంటి చిత్రాల్లో నటించినా, ఆమెకు తొలి హిట్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో లభించింది. అమ్మోరు 1992లో ప్రారంభమై 1995లో విడుదలై పెద్ద హిట్ అయింది. ఈ సినిమా విడుదలయ్యే నాటికి సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరో కృష్ణ సరసన నెంబర్ వన్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. హీరోయిన్ అంటే హీరో పక్కన డాన్సులు చేయడానికే పరిమితం అనుకునే రోజుల్లో, ఆమెకు మంచి పాత్రలు రావడం విశేషం. ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా నిర్మాతలు డేట్స్ ప్రకారం షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలందరి సరసన సౌందర్య నటించింది. తెలుగులో బిజీగా ఉన్నప్పటికీ తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి జాతీయ నటిగా ఎదిగే ప్రయత్నం చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అరుణాచలం, నరసింహ చిత్రాల్లో, అమితాబ్ బచ్చన్‌తో సూర్యవంశ్ చిత్రంలో నటించింది. 1993 నుంచి 2001 మధ్య కాలంలో ఏడాదికి సుమారు పది చిత్రాల్లో నటించింది సౌందర్య. యమలీల చిత్రంలో ఆలీ సరసన సౌందర్య నటించాల్సి ఉంది. అప్పట్లో పెద్ద హీరోల పక్కన అవకాశాలు వస్తున్నప్పటికీ, తన మాతృ సంస్థ మనీషా ఫిలిమ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి ఆ సినిమాను అంగీకరించింది. అయితే, ఆమె తండ్రి సత్యనారాయణ అభ్యర్థన మేరకు నిర్మాత అచ్చిరెడ్డి, సౌందర్యకు బదులుగా ఇంద్రజను ఎంపిక చేశారు. దీనిపై సౌందర్య చాలా గొడవ చేసింది. ఆలీ సరసన నటించడం వల్ల తన కెరీర్ దెబ్బతినదని వాదించింది. ఆలీతో ఒక సినిమా చేస్తానని ఆమె పట్టుబట్టడంతో, దర్శకుడు కృష్ణారెడ్డి శుభలగ్నం సినిమాలో వారిద్దరికీ ఒక పాటను పెట్టారు.

సౌందర్య తండ్రి సత్యనారాయణ ఒక జ్యోతిష్యుడు కూడా. 2004లోనే సౌందర్య కెరీర్ ముగుస్తుందని ఆయన ముందే చెప్పారు. సౌందర్య ఈ మాటను ఒప్పుకునేవారు కాదు, 50 ఏళ్లు వచ్చే వరకు నటిస్తూనే ఉంటానని, ఇండస్ట్రీ తనను వదులుకోదని అనేవారు. అయితే విధి బలీయం. 2004 ఏప్రిల్ 17న, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన సౌందర్య ఇక తిరిగి రాలేదు. ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సౌందర్యకు అప్పటికి పెళ్లి అయ్యి ఏడాది కూడా నిండలేదు. ఒకే రోజు కొడుకును, కూతురిని పోగొట్టుకున్న తల్లి మంజుల కడుపుకోత తీర్చడం ఎవరి తరం? సౌందర్య మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.

ఇది చదవండి:  ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us