నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు వచ్చారు. యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆ తర్వాతి తరంలో బాలకృష్ణ, హరికృష్ణ, ఇక థర్డ్ జెనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రాబోతున్నారు. అతనే తారక్ బావ మరిది నార్నే నితిన్. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతికి ఇతను స్వయానా తమ్ముడు. ఇప్పటికే శ్రీశ్రీశ్రీ రాజావారు అనే ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నార్నే నితిన్. అయితే ఇది రిలీజ్ కాకుండానే మరో సినిమాను పట్టాలెక్కించాడు. సితార ఎంటర్టైనర్మెంట్స్ బ్యానర్తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయిసౌజన్య నిర్మిస్తోన్న ఈ మూవీకి మ్యాడ్ అనే టైటిల్ను ఖరారు చేశారు. కల్యాణ్ శంకర్ మ్యాడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నార్నే నితిన్తో పాటు సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మ్యాడ్ సినిమా టీజర్ రిలీజైంది. మా ఇంజినీరింగ్ కాలేజీలో స్పోర్ట్స్ క్లబ్, డ్రామా క్లబ్, ఎన్సీసీ అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ర్యాంగింగ్ మాత్రమే అని వాయిస్ వినిపించిన వెంటనే సీనియర్లు జూనియర్స్ను ర్యాగింగ్ చేస్తూ కనిపిస్తారు. హీరో, హీరోయిన్ల లవ్ సీన్స్, విద్యార్థుల మధ్య గొడవలు, ర్యాగింగ్ సీన్లతో టీజర్ ఫన్ఫుల్గా ఉంది.
ధమాకా వంటి బ్లాక్బస్టర్ సినిమాకు స్వరాలు సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. షామ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. కాగా మ్యాడ్ సినిమా కంటే ముందు శ్రీశ్రీశ్రీ రాజావారుగా మన ముందుకు రానున్నాడు నార్నే నితిన్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతితో జాతీయ పురస్కారం అందుకున్న సతీష్ వేగేశ్న ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండింటితో పాటు గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్లోనూ ఓ సినిమా చేయనున్నాడు నార్నే నితిన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి