
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు డైరెక్టర్ సుకుమార్. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించిన సుకుమార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..పుష్ప తర్వాత సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా భారీ హిట్ అందుకుంది. ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి నయా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప సినిమా. కాగా సుకుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కథల్లో నిజాయితీ గురించి మాట్లాడుతూ, నిజ జీవితంలో సంభవించే సంఘటనలను, లాజిక్ను జోడించి కథలుగా అల్లుతానని తెలిపారు. వాస్తవ ప్రపంచంలోని జీవితాలు చాలా క్లిష్టంగా, సంక్లిష్టంగా ఉంటాయని, వాటిని యథాతథంగా కాపీ చేయడానికి సమయం సరిపోదని అభిప్రాయపడ్డారు సుకుమార్.
లెక్కల మాస్టర్ గా నెలకు 35,000 రూపాయల జీతం పొందే తను, కేవలం 1,400 రూపాయల కోసం సహాయ దర్శకుడిగా మారడానికి గల కారణం కేవలం పేరు ప్రఖ్యాతులు సంపాదించడమేనని సుకుమార్ స్పష్టం చేశారు. చిన్నతనంలో ఐన్స్టీన్లా గొప్ప ప్రొఫెసర్ లేదా శాస్త్రవేత్త కావాలని కలలు కన్నారట సుకుమార్. అయితే, సైన్స్ ఎగ్జిబిషన్లను సందర్శించిన తర్వాత, ఆ మార్గం చాలా కష్టమని, తనలో అంత మేధస్సు లేదని గ్రహించారట.
అప్పుడు పేరు సంపాదించడానికి సులభమైన మార్గం కోసం ఆలోచించడం మొదలుపెట్టారట. యండమూరి వీరేంద్రనాథ్లాగా గొప్ప రచయిత అయితే, ఆయనకున్న ఇమేజ్ తనకు కూడా వస్తుందని భావించారు. అయితే, యండమూరి వీరేంద్రనాథ్ స్వయంగా దర్శకత్వం చేయడం ప్రారంభించినప్పుడు, దర్శకత్వం రచన కంటే గొప్పదని, దాని ద్వారా మరింత ఎక్కువ కీర్తిని పొందవచ్చని సుకుమార్ అనుకున్నారట. ఇదే ఆలోచనతో, తక్కువ శ్రమతో ఎక్కువ కీర్తిని పొందవచ్చని ఆలోచించి, సినీ దర్శకత్వంలోకి అడుగుపెట్టానని సుకుమార్ చెప్పుకొచ్చారు.