Ratan Tata: ‘భారతీయులకు ఇది బాధాకరమైన రోజు’.. రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒరవడిని సృష్టించడంతో పాటు నిస్వార్థంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రతన్ టాటా అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Ratan Tata: భారతీయులకు ఇది బాధాకరమైన రోజు.. రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
Ratan Tata

Updated on: Oct 10, 2024 | 9:13 AM

వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న ఆయన బుధవారం (అక్టోబర్ 09) రాత్రి తుదిశ్వాస విడిచారు. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒరవడిని సృష్టించడంతో పాటు నిస్వార్థంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రతన్ టాటా అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. వ్యాపార దిగ్గజానికి నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రతన్ తో తమ కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రతన్ టాటాకు నివాళులు అర్పించారు. ‘భారతీయులకు ఇది ఎంతో బాధాకరమైన రోజు. సామాజిక సేవలో రతన్‌టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో రతన్ జీ ఒకరు. ఆయన నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. అసాధారణ మానవుడు. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా.. మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు. మనం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు భావి తరాలకు స్ఫూర్తినిస్తాయి.. మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్‌ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు చిరంజీవి.

చిరంజీవి ట్వీట్..

దేశం ఎప్పటికీ ఆయనకు రుణ పడి ఉంటుంది..

‘రతన్‌ టాటాది బంగారంలాంటి మనసు. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దూరదృష్టి ఉన్న రతన్ జీ ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

రతన్ జీ మీరు లెజెండ్.. మీకు మరణం లేదు..

‘రతన్‌టాటా ఓ లెజెండ్‌. మన హృదయాల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఆయన భావి తరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. జైహింద్‌’ అని ట్విట్టర్ వేదికగా వ్యాపార దిగ్గజానికి నివాళి అర్పించారు రాజమౌళి.

వీరితో పాటు రానా దగ్గుబాటి, దేవి శ్రీ ప్రసాద్, ఖుష్బూ తదితర సినీ ప్రముఖులు రతన్ టాటాకు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.