AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాలయ్య, శోభన్ బాబు కలిసి యాక్ట్ చేసిన ఏకైక చిత్రం.. ఫలితం ఏంటంటే..?

1992లో పరిశ్రమ రాయితీల నేపథ్యంలో నిర్మితమైన అశ్వమేధం చిత్రం శోభన్ బాబు, బాలకృష్ణల అరుదైన మల్టీస్టారర్‌గా నిలిచింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, అశ్వినీదత్ నిర్మాణంలో, ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం 1992 డిసెంబర్ 25న విడుదలై మిశ్రమ స్పందన పొందింది.

Tollywood: బాలయ్య, శోభన్ బాబు కలిసి యాక్ట్ చేసిన ఏకైక చిత్రం.. ఫలితం ఏంటంటే..?
Balakrishna Shoban Babu
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2026 | 2:45 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడాలని, లోబడ్జెట్ చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 1992లో ప్రకటించిన రాయితీలు ఆరంభంలో నిర్మాతలకు అనుకూలంగానే కనిపించాయి. అయితే, ఈ రాయితీలు చిత్ర నిర్మాణాల సంఖ్యను బాగా పెంచినప్పటికీ, కథ, కథనం, చిత్రీకరణ నాణ్యతపై దృష్టి తగ్గడానికి దారితీశాయి. ఎప్పటికప్పుడు చర్చించుకోవడానికి అవకాశం లేకుండా, పరిశ్రమలో ఒకరకమైన హడావిడి వాతావరణం ఏర్పడింది. త్వరగా చిత్రాన్ని పూర్తి చేయాలనే తాపత్రయం తప్ప, నాణ్యత గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ మార్పులకు బలైన భారీ చిత్రాల్లో ఒకటి అశ్వమేధం. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంతో సెన్సేషనల్ హిట్ సాధించిన నిర్మాత అశ్వినీదత్, కొత్త సినిమా నిర్మాణం కోసం సన్నాహాలు ప్రారంభించారు. మహానటుడు ఎన్టీఆర్‌తో తన బ్యానర్ ప్రారంభించి, ఆయనతో రెండు చిత్రాలు నిర్మించిన అశ్వినీదత్, ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి నటసింహం బాలకృష్ణతో ఒక సంచలన విజయం సాధించాలని సంకల్పించారు. అంతకుముందు బాలకృష్ణ-శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా రాలేదు కనుక, వారిద్దరితో భారీ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడిగా కె. రాఘవేంద్రరావును ఎన్నుకున్నారు. బాలకృష్ణ, శ్రీదేవి డేట్స్ సంపాదించి కథ సిద్ధం చేసుకుని షూటింగ్ వెళ్దామని అనుకునేంతలో అనుకోని అవాంతరం ఎదురై ఆ సినిమా ప్రారంభం కాలేదు. అయినా అశ్వినీదత్ నిరుత్సాహ పడకుండా ఎనిమిది నెలలు కథా చర్చలు జరిపి మరో అద్భుతమైన కథను తయారు చేయించారు.

అరుదైన కాంబినేషన్లు కుదర్చడంలో సిద్ధహస్తుడైన అశ్వినీదత్, నటభూషణ శోభన్‌బాబు, నటసింహం బాలకృష్ణ తొలి కాంబినేషన్‌లో అశ్వమేధం చిత్రం షూటింగ్ ప్రారంభించారు. 1992 జూన్ 29న అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ అభిమన్యుగా శోభన్ బాబు, ఆయన తమ్ముడు పైలట్ ఆఫీసర్ కిరీటిగా బాలకృష్ణ నటించారు. వీరి ఫ్యామిలీ డాక్టర్‌గా మీనా, ఆమె దగ్గర కంపౌండర్‌గా బాబూమోహన్, జర్నలిస్టుగా నగ్మా, ఆమె అసిస్టెంట్‌గా బ్రహ్మానందం నటించారు. శోభన్ బాబు సరసన గీత నటించారు. అల్లు రామలింగయ్య, ప్రసాద్ బాబు కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ముగ్గురు విలన్లను ఎంపిక చేశారు – ముంబై నుంచి అమ్రీష్ పురి, చెన్నై నుండి రాధారవి, హైదరాబాద్ నుండి కోట శ్రీనివాసరావు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. తనని బాగా ఇన్‌స్పైర్ చేసిన చిత్రాలకు ప్రత్యేక ఆసక్తి చూపించే ఇళయరాజా, అశ్వమేధం చిత్రం కూడా ఆయనకు బాగా నచ్చడంతో ముంబై నుంచి ప్రత్యేకంగా ఆర్కెస్ట్రాను పిలిపించి ఆ సినిమా రీ-రికార్డింగ్ చేశారు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, శోభన్‌బాబు, బాలకృష్ణ నటించిన మల్టీస్టారర్ మూవీ అశ్వమేధం చిత్రానికి మాత్రం మూడు కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రం 1992 డిసెంబర్ 25న విడుదలయ్యింది. సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్లు లభించాయి. అయితే, చిత్రానికి మిశ్రమ స్పందన లభించడంతో 100 రోజులు ఆడటం కష్టమైంది. మొత్తం ఎనిమిది కేంద్రాల్లో మాత్రమే అశ్వమేధం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. 1992 నాటి రాయితీల కారణంగా పరిశ్రమలో చోటుచేసుకున్న మార్పుల ప్రభావానికి గురైన ఒక ముఖ్యమైన భారీ చిత్రంగా అశ్వమేధం నిలిచింది.

Follow Us