
టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన జోష్ రవి ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ హఠాన్మరణం చెందారు. కార్తీక మాసం సందర్భంగా.. స్థానికంగా ఉండే శివాలయంలో అభిషేకాలు చేయించడానికి వెళ్లిన జోష్ రవి తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆలయ ప్రాంగణంలోనే కుప్పకూలి పోయారు. దీంతో భక్తులు ఆయనను ఇంటికి తరలించారు. అయితే తీవ్ర గుండెపోటు రావడంతో సూర్య వెంకట నరసింహ శర్మ ఆ కాసేపటికే తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో జోష్ రవి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు జోష్ రవి ఇంటికి వెళుతున్నారు. పెద్దాయన చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్నారు. అలాగే జోష్ రవికి ధైర్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి జోష్ రవి కుటుంబాన్ని పరామర్శించారు. స్వయంగా రవి ఇంటికి వెళ్లిన ఆకాశ్ జోష్ రవిని ఆప్యాయతతో హత్తుకుని ధైర్యం చెప్పారు. అనంతరం జోష్ రవి తల్లితో కూడా మాట్లాడారు. ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని.. ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా జోష్ రవి పట్ల ఆకాశ్ పూరి చూపించిన ప్రేమాభిమానాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఆకాశ్ ది చిన్న వయసైనా చాలా గొప్ప మనసు చాటుకున్నాడని సినీ అభిమానులు, నెటిజన్లు పూరీ తనయుడిపై ప్రశంసల కురిపిస్తున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాశ్ ఆంధ్రా పోరీ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మెహబూబ్, రొమాంటిక్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించాడు. అయితే కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయాడు. చివరిగా అతను 2022లో చోర్ బజార్ అనే సినిమాలో నటించాడు. ఈ యంగ్ హీరో తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది.
నాగా చైతన్య నటించిన ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రవి. తన ట్యాలెంటెడ్ యాక్టింగ్ తో జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా చేసి మెప్పించాడు. అలాగే ‘జబర్దస్త్’ కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.