అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో వాచ్మెన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఎన్నో కష్టాలను చూసి సక్సెస్ అయినా వారే.. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు స్టార్స్ అయినా వారు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది చేస్తున్న జాబులు, వ్యాపారాలు వదులుకొని సినిమాల్లోకి వస్తుంటారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుల్లో సయాజీ షిండే ఒకరు. విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ మెరిశారు. అదేవిధంగా హీరో తండ్రి పాత్రల్లోనూ కనిపించి నవ్వులు పూయించారు సయాజీ షిండే. కాగా ప్రస్తుతం సయాజీ షిండే సినిమాల స్పీడ్ తగ్గించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం, సినీ రంగ ప్రవేశం, ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ దగ్గర వేలే కాంతి అనే చిన్న గ్రామంలో జన్మించారు సయాజీ షిండే. ఆయన తల్లిదండ్రులు రైతులు. ఏడవ తరగతి వరకు తన స్వగ్రామంలో చదివి, ఆ తర్వాత తన అక్క దగ్గరకు వెళ్లి పదవ తరగతి పూర్తి చేశారు. డీ.ఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా మారాలని భావించినా, కనేర్ డ్యామ్ ప్రాజెక్ట్ కారణంగా తమ భూములు కోల్పోవడంతో ఆ ప్లాన్ మారినట్లు తెలిపారు.
ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేశారు. రాత్రిపూట వాచ్మెన్గా పనిచేస్తూనే పగలు కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం అదే డిపార్ట్మెంట్లో క్లర్క్గా ప్రమోషన్ అందుకున్నారు. అయితే, నటుడు కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఆ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబైకి బయల్దేరారు. తొలుత బ్యాంకులో క్లర్క్గా ఆరు నెలలు పనిచేశారు. ఆ తర్వాత నటనపై దృష్టి సారించారు.
“త్వరగా నటుడిని కావాలని, డబ్బు సంపాదించాలని, ఫేమస్ అవ్వాలని నేను అనుకోలేదు. మంచి నటుడిని కావడమే నా లక్ష్యం” అని సయాజీ షిండే పేర్కొన్నారు. రోజు ఉదయం ఐదున్నర గంటలకు లేచి, వాయిస్ ఎక్సర్సైజ్లు, యాక్టింగ్ వర్క్షాప్లలో పాల్గొనేవారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం చేసి, సాయంత్రం లైబ్రరీలో చదువుకునేవారు. రాత్రి మళ్లీ నాటకాలకు సంబంధించిన మీటింగ్లు, ప్రాక్టీస్లలో పాల్గొనేవారు. దాదాపు పదేళ్ల పాటు ఈ కఠోర శ్రమను కొనసాగించారు. 1987లో తన మొదటి నాటకంలో నటించారు. ఆ తర్వాత కొన్ని నాటకాల నుంచి ఆయనను తీసేశారు. సయాజీ షిండేకు తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి అవకాశం చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంతో లభించింది. అశ్వనీదత్, అల్లు అరవింద్ గారు తన హిందీ చిత్రం కలకత్తా మెయిల్ (చిరంజీవి చూడాలని ఉంది రీమేక్) చూసి ఠాగూర్ చిత్రానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఠాగూర్ షూటింగ్లో మొదటి రోజు చిరంజీవి “మీరు కంఫర్టబుల్గా ఉన్నారా?” అని అడిగినప్పుడు, తాను థియేటర్ ఆర్టిస్ట్నని, తెలుగు డైలాగులతో ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. వాయిస్, డైలాగులకు థియేటర్లో చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. చిరంజీవి వెంటనే దర్శకుడు వి.వి.వినాయక్తో మాట్లాడి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను తన హోటల్కు పంపి, తర్వాతి రోజు సీన్ల డైలాగులను అర్థం చేసుకునేలా సహాయం చేశారని సయాజీ షిండే గుర్తు చేసుకున్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సహకారం అందించి, స్టార్డమ్ను చూపించకుండా అందరితో కలిసిపోవడం తెలుగు చిత్ర పరిశ్రమలో తనకెంతో నచ్చిందని షిండే అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
